కాల్షియం మన శరీరంలో ఒక కీలకమైన పోషక పదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపే శరీర విధులకు కాల్షియం ముఖ్యం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు మరియు నరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం ఎంతగానో అవసరం. ముఖ్యంగా అస్థిపంజర పనితీరుకు కాల్షియమే ఆధారం. అయితే కొందరిలో పలు కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది.
దీన్ని వైద్య పరిభాషలో హైపోకాల్సీమియా అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోనట్లయితే… ఆస్టియోపెనియా అనే ఎముకలు సన్నబడే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు మరియు ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఆహార అలవాట్లలో మార్పులు చేసినట్లయితే… కాల్షియం లోపాన్ని నివారించవచ్చు.
కాల్షియం లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
- పాదాలు, వేళ్లు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి.
- కండరాలలో తిమ్మిర్లు లేదా కండరాలు పట్టేయడం.
- బద్ధకం, అలసట.
- బలహీనంగా, పెళుసుగా ఉండే గోర్లు.
- దంత సమస్యలు.
- గందరగోళంగా అనిపించడం.
- ఆకలి మందగించడం.
ఇక కాల్షియం దీర్ఘకాలికంగా లోపిస్తే అనేక ఇతర శరీర భాగాలను బాధిస్తుంది. అందుకే మనకు పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినట్లయితే పరీక్ష చేయించుకుని, లోపం ఉందని నిర్ధారణ అయితే తగిన మందులు వాడటం మంచిది. లేదంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు..!!
- పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, పులియబెట్టిన పెరుగు, పన్నీర్, రసమలై.
- బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు.
- మినరల్ వాటర్.
- సీఫుడ్, కొవ్వులేని మాంసం, గుడ్లు.
- ఖర్జూరం తీసుకోవడం మంచిది.
కాల్షియం పుష్కలంగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి కాల్షియం లోపించకుండా చూసుకోవడం ముఖ్యం.
