సాధారణంగా పెద్దల కాళ్లకు నమస్కారం చేయాలి అని చెబుతూ ఉంటారు. అయితే అలా పెద్దవారి కాళ్లకు ఎందుకు దండం పెట్టాలి అని చాలామందికి తలెత్తి ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్దలు అంటే మనకంటే ఎక్కువ కాలం జీవించిన వారు, అలాగే అన్ని విషయాలలో అనుభవం ఉన్నవారు. అటువంటి పెద్దల పాదాలకు నమస్కారం చేస్తే, మనలో ఉన్న అహాన్ని వదిలి పెద్దల మార్గాన్ని అనుసరిస్తున్నాము అనే సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అలాగే పెద్దలకు నమస్కారం చేసేటప్పుడు మన తలను వారి పాదాలకు ఆనించడం అంటే, మన జ్ఞానాన్ని వారి అనుభవంతో అనుసంధానం చేస్తున్నట్లే అని పండితులు చెబుతున్నారు.
మన శరీరంలోని నరాలు మెదడు నుంచి చేతులు, కాలి వేళ్ల చివర్ల వరకు విస్తరించి ఉంటాయి. పెద్దవారి పాదాలకు నమస్కరించినప్పుడు, వారి పాదాల నుండి శక్తి అందుతుందని, మన చేతి వేళ్లు ఆ శక్తిని గ్రహిస్తాయని చెబుతుంటారు. ఇలా నమస్కరించినప్పుడు పెద్దవారి హృదయం నుంచి సానుకూల శక్తితో నిండిన తరంగాలు ఆ పాదాల కొనల నుంచి చేతివేళ్ల ద్వారా నమస్కరించే వారి శరీరంలోకి వెళ్తాయని చెబుతుంటారు. అలాగే ఆశీర్వాదం తీసుకునే సమయంలో మన కుడి చేతిని వారి ఎడమ కాలికి, మన ఎడమ చేతిని వారి కుడి కాలికి తాకే విధంగా నమస్కారం చేయాలి.
అదేవిధంగా నమస్కారం చేసే సమయంలో వంగి నమస్కారం చేయడం, అలాగే మోకాళ్లపై కూర్చుని నమస్కరించడం, నుదిటిని నేలకు తాకించి సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయట. వీటి ద్వారా వెన్ను, నడుము, మోకాళ్లు వంగడం వల్ల శరీరంలోని కీళ్లన్నీ సాగుతాయి. దాంతో మెదడులోని నరాలు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది.
