Syamantaka Mani : శమంతక మణి.. ఎంతో విలువైనదని మన పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది. ద్వాపరయుగానికి చెందిన మహారాజు సత్రాజిత్తు భక్తికి మెచ్చి సూర్యుడు దీన్ని అతడికి ప్రసాదించాడు. శమంతకమణి రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుందని అంటారు. 8 బారువులు అంటే దాదాపు వంద కేజీల బంగారం. శమంతకమణి ఉన్నచోట కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు. అయితే ఇది ఎవరి దగ్గరా ఎక్కువ కాలం నిలువదు. ఎందుకంటే.. ఇది ఎవరి దగ్గరుంటే వాళ్లలో మంచి ఆలోచనను చంపేస్తుంది. పురాణాల్లో శమంతకమణి(Syamantaka Mani) సాగించిన ప్రయాణమే దీనికి నిదర్శనం. ఇంతకీ శమంతక మణి ఇప్పుడు ఎక్కడుంది ?
We’re now on WhatsApp. Click to Join
సూర్యుడు ప్రసాదించిన శమంతకమణిని సత్రాజిత్తు ఓసారి శ్రీ కృష్ణుడికి చూపించాడు. కృష్ణుడు అడిగినా దాన్ని ఇవ్వలేదు.
ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ధరించి వేటకు వెళితే ఓ సింహం అది మాంసం ముక్క అనుకుని.. అతడిని చంపేసి తీసుకెళ్లిపోయింది. ఆ సింహంతో జాంబవంతుడు పోరాడి .. మణిని తీసుకెళ్లి తన కూతురు జాంబవతికి ఇచ్చాడు. తనపై పడిన నీలాప నిందను మాపుకునేందుకు శ్రీ కృష్ణుడు.. శమంతక మణిని వెతుకుతూ వెళ్లి జాంబవంతుడితో పోరాడుతాడు. చివరకు గెలిచి.. ఆ మణిని, సత్యభామను తీసుకొచ్చి సత్రాజిత్తుకు అప్పగిస్తాడు. అప్పుడు ఆ మణిని, తన కూతురు సత్యభామను కృష్ణుడికి సత్రాజిత్తు అప్పగించాడని కథలో ఉంటుంది. అయితే సత్రాజిత్తు ఇచ్చిన మణిని శ్రీ కృష్ణుడు అప్పుడే తిరిగి ఇచ్చేశాడు.
మరోవైపు శ్రీ కృష్ణుడిపై నీలాప నిందలు వేసిన సత్రాజిత్తుపై అక్రూరుడు కోపం పెంచుకుంటాడు. సత్రాజిత్తుని శత్రువుగా భావించే శతథన్వుడు అనే రాజును అతడిపైకి పురికొల్పుతాడు. సత్యభామను తనకిచ్చి పెళ్లిచేస్తానని మాటిచ్చిన సత్రాజిత్తు ఆ తర్వాత కృష్ణుడికి ఇవ్వడంతో శతధన్వుడు కూడా ద్వేషంతో రగిలిపోతుంటాడు. ఈక్రమంలో శతథన్వుడు దాడి చేసి సత్రాజిత్తును చంపేస్తాడు. దీంతో శమంతకమణి శతధన్వుడి వద్దకు చేరుతుంది. సత్యభామ తండ్రి సత్రాజిత్తును చంపేశారనే వార్త కృష్ణుడికి తెలుస్తుంది. దీంతో శతధన్వుడిని తన సుదర్శన చక్రంతో శ్రీ కృష్ణుడు హతమారుస్తాడు. అప్పుడే ఆ మణి కృష్ణుడి దగ్గరకు చేరిందని భావిస్తారు. అనంతరం అక్రూరుడు కాశీలో ఉన్నాడని తెలిసి పిలిపించిన శ్రీ కృష్ణుడు.. శమంతకమణిని బయటకు తీయమని చెప్పాడు. అప్పుడు అక్రూరుడు ఆ మణిని ఇవ్వబోతుంటే.. దీని సహాయంతో దానధర్మాలు చేస్తూ ద్వారకలోనే ఉండమని శ్రీ కృష్ణుడు సూచిస్తాడు.
శ్రీ కృష్ణుడు నిర్యాణానికి ముందు శమంతకమణిని తీసుకుని ద్వారక నుంచి సోమనాథ్కు వెళ్లి.. ఆ సమీపంలోనే ఉన్న బాల్కాతీర్థ్ అనే ప్రదేశానికి వెళ్లాడు. అదే కృష్ణుడు నిర్యాణం చెందిన ప్రదేశం. ఆ తర్వాత అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశాడు. సోమనాథ్ వరకూ వచ్చిన శ్రీ కృష్ణుడు..తన నిర్యాణానికి సమయం అసన్నమయ్యే ముందు సూర్యుడిని ప్రార్థించాడని అంటారు. ప్రత్యక్షమైన ఆదిత్యుడికి ఆ మణిని తిరిగి ఇచ్చేసి అవతారం చాలించాడని చెబుతారు.