రీసెంట్ గా ఒక బహిరంగ చర్చలో నటుడు ప్రకాష్ రాజ్ రామాయణ గాథను ప్రాంతీయ కోణంలో విశ్లేషించడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. శ్రీరాముడు ఉత్తర భారతీయుడని, రావణుడు దక్షిణ భారతానికి చెందిన గిరిజన నాయకుడని ఆయన పేర్కొనడం వివాదాస్పదమైంది. మరీ ముఖ్యంగా, రాముడు పండ్లు దొంగిలించడం వల్లే ఈ ఘర్షణ మొదలైందన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవాన్ని ఇలా కించపరచడంపై హిందూ సంఘాలు మరియు కొన్ని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆయనను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
నాగబాబు గట్టి కౌంటర్.. ముదిరిన రాజకీయ సెగ
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాష్ రాజ్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే మతపరమైన అంశాలను, పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మన మూలాలను, ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోవాలని, గతంలో హిందూ ధర్మాన్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోయారని నాగబాబు ఘాటుగా హెచ్చరించారు. కేవలం విమర్శల కోసమే విమర్శలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య ఉన్న పాత విభేదాల నేపథ్యంలో, తాజా వివాదం టాలీవుడ్లో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
వక్రీకరణ అంటూ ప్రకాష్ రాజ్ వివరణ.. కుట్ర కోణంపై ధ్వజం
వివాదం ముదురుతున్న తరుణంలో ప్రకాష్ రాజ్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒక లిటరరీ ఫెస్టివల్లో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. తాను అవతార పురుషుడైన శ్రీరాముడిని ఎగతాళి చేయలేదని, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వారే తనను ‘యాంటీ హిందూ’గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కొందరు తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తాను ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని స్పష్టం చేస్తూ విమర్శకుల నోళ్లు నొక్కే ప్రయత్నం చేశారు.
To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026
