Site icon HashtagU Telugu

Navaratri 2024: నవరాత్రులలో కలశం స్థాపించడానికి శుభ సమయం ముహూర్తం ఇదే!

Navaratri 2024

Navaratri 2024

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు. దాదాపు పది రోజులపాటు ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్లో పూజలు చేసుకునే వారు మొదటి రోజు కలసిస్తాపన చేసుకోవడం అన్నది తప్పనిసరి. నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టిస్తూ ఉంటారు. అనంతరం దుర్గాదేవి పూజను ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల దుర్గాదేవి కలశం లో నివసిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది కలశ స్థాపనకు శుభ ముహూర్తం సమయం ఎప్పుడూ అన్న వివరాల్లోకి వెళితే..

నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్టిస్తారు. కాగా ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీన 00:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 02:58 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. శారదీయ నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపనకు రెండు శుభ ముహూర్తాలు ఉన్నాయి. కలశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ సమయం ఉదయం 6.15 నుంచి 7.22 వరకు ఉంటుంది. ఇది కలశ స్థాపన ఏర్పాటుకు ఉదయం ఒక గంట 6 నిమిషాల సమయం ఉంది. అంతే కాకుండా మధ్యాహ్నం కలశ స్థాపన సమయం కూడా అభిజీత్ ముహూర్తంలోనే ఉంది.

ఇది ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. మధ్యాహ్నం 11:46 నుండి 12:33 వరకు ఏ సమయంలోనైనా కలశాన్ని స్థాపించవచ్చు. మధ్యాహ్నం కలశ స్థాపన కు 47 నిమిషాల శుభ సమయం లభిస్తుంది. కలశాన్ని ప్రతిష్టాపన చేయడానికి శుభ్రమైన, పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ఈ స్థలం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకుని బియ్యం, గోధుమలు, బార్లీ, శనగలు, నాణేలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి మామిడి ఆకులు పెట్టి దాని పైన కొబ్బరికాయను ఉంచాలి.

కలశాన్ని పసుపు, కుంకుమతో అలంకరించి పీఠంపై అమర్చాలి. పసుపు, బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కలశాన్ని అలంకరించాలి. అమ్మవారి మంత్రాలను జపించి కలశంలో నీటిని సమర్పించి ధూపం వెలిగించాలి. కాగా నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టాపన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉండండి. కలశ స్థాపన సమయంలో మనస్సులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉండకూడదు. మొత్తం నవరాత్రులలో నియమ నిష్టల ప్రకారం కలశాన్ని పూజించాలి. దేవీ నవరాత్రి రోజున పూజ చేసి నవమి తిథి రోజున కలశాన్ని పీటం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయాలని పండితులు చెబుతున్నారు..