Raghunath Temple: 36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం

కశ్మీర్ లోయలో మూడున్నర దశాబ్దాల క్రితం మూతపడిన ఓ చారిత్రక హిందూ దేవాలయం తిరిగి తెరుచుకుంది. ఉగ్రవాదం కారణంగా మూతపడిన శ్రీనగర్‌లోని హబ్బాకడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ మందిరాన్ని రామ నవమి పర్వదినం సందర్భంగా పునఃప్రారంభించారు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ వేడుకల్లో కశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లింలు, పౌర, పోలీసు శాఖల అధికారులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ మాట్లాడుతూ.. “చాలా […]

Published By: HashtagU Telugu Desk
After decades of silence, Raghunath Temple in Srinagar, J&K has finally been reopened for devotees after 36 years.

After decades of silence, Raghunath Temple in Srinagar, J&K has finally been reopened for devotees after 36 years.

కశ్మీర్ లోయలో మూడున్నర దశాబ్దాల క్రితం మూతపడిన ఓ చారిత్రక హిందూ దేవాలయం తిరిగి తెరుచుకుంది. ఉగ్రవాదం కారణంగా మూతపడిన శ్రీనగర్‌లోని హబ్బాకడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ మందిరాన్ని రామ నవమి పర్వదినం సందర్భంగా పునఃప్రారంభించారు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ వేడుకల్లో కశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లింలు, పౌర, పోలీసు శాఖల అధికారులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.

ఈ సందర్భంగా శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ మాట్లాడుతూ.. “చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ రామ నవమి వేడుకలు జరుపుకుంటున్నాం. పౌర యంత్రాంగం, పోలీసులు, స్థానికులు, ఆలయ నిర్వాహకులు అందరి సహకారంతో ఇది సాధ్యమైంది” అని తెలిపారు. ఈ నెలలో నవరాత్రి, నవ్రోజ్‌, ఇప్పుడు రామ నవమి.. అన్ని పండుగలనూ సామరస్యపూర్వక వాతావరణంలో జరుపుకున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఆలయ నేపథ్యం.. పునరుద్ధరణ

జమ్మూలోని రఘునాథ్ ఆలయం నమూనాలో 1857లో మహారాజా గులాబ్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. 1990ల ప్రారంభంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెరిగిపోయి, కశ్మీరీ పండిట్లు భారీగా వలస వెళ్లినప్పుడు అనేక ఆలయాలతో పాటు ఈ రఘునాథ్ మందిరాన్ని కూడా మూసివేశారు. కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయ పునరుద్ధరణ పనులను 2020లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టారు. జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ (INTACH) సహకారంతో పునరుద్ధరణ పనులు పూర్తిచేశారు.

స్థానికుల హర్షం

ఆలయం తిరిగి తెరుచుకోవడంపై స్థానికులు, ముఖ్యంగా ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేసింది. “ఈ ఆలయం మా సంస్కృతి, వారసత్వంలో భాగం. రామ నవమికి మళ్లీ తెరవడం ఆనందంగా ఉంది. మా కశ్మీరీ పండిట్ సోదరులు కూడా లోయకు తిరిగి వచ్చి గతంలోలా మాతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను” అని సమీపంలోని ఫతేకడల్ వాసి అబ్దుల్ రషీద్ (72) అన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు భరత్ రైనా మాట్లాడుతూ.. “ఈ వేడుకలు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని చూపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మేము ఇక్కడే ఉన్నాం, మా ముస్లిం సోదరులు మాకు అండగా నిలిచారు” అని చెప్పారు. మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ ఆలయాన్ని తెరవగలిగినప్పుడు, మూతపడిన ఇతర ఆలయాలను కూడా పునరుద్ధరించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని, కశ్మీరీ పండిట్లు లోయకు తిరిగి రావడానికి ఇది సరైన సమయమనిపిస్తోందని ఆయన అన్నారు.

  Last Updated: 27 Mar 2026, 09:57 AM IST