Markandey Mahadev: అక్కడ శివయ్యకు బిల్వ పత్రంతో పూజ చేస్తే సంతానం కలగడం ఖాయం.. ఎక్కడో తెలుసా?

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయంలో పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Markandey Mahadev

Markandey Mahadev

దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రదేశాలలో ఉన్న దేవుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే దేవుడు పరమేశ్వరుడు. ఒకొక్క ప్రదేశంలో ఒక్కో అవతారంలో ఒక్కొక్క పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు పరమేశ్వరుడు. అయితే ఎక్కడైనా సరే పరమేశ్వరుడికి ఇష్టమైన బిళ్ళ పత్రాలతో పూజిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయంలో ఈ బిల్వపత్రాలు కాస్త ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వారాణసిలో మార్కండేయ మహాదేవ మందిరం ప్రాముఖ్యత మతపరమైన, చారిత్రక, ఆధ్యాత్మిక అనే మూడు దృక్కోణాల్లో చాలా ప్రత్యేకమైనది.

ఈ ఆలయం వారణాసి నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ ప్రాముఖ్యత పురాణాలతో, ముఖ్యంగా మార్కండేయ పురాణం, శివ పురాణాలతో ముడిపడి ఉంటుంది. ఈ ఆలయం శివుని ప్రధాన ఆలయాలలో ఒకటిగా చెప్పవచ్చు. భక్తులు తమ కోరికలను తీర్చమంటూ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో, మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. ఈ ఆలయంలోని ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు శాంతి, ఓదార్పునిస్తుందని చెప్పాలి.

ఇక్కడ స్వామి వారికీ బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయట. ఇతర దేవాలయాలలో, పూలు, పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే మార్కండేయ మహాదేవ ఆలయంలో బిల్వ పత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. నిర్మలమైన హృదయంతో బిల్వ పత్రాలను సమర్పించే భక్తుల ప్రతి కోరికను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. పిల్లలు కావాలని కోరుకునే భక్తులకు ఈ ఆలయం మరింత స్పెషల్ అని చెప్పాలి. సంతానం కోసం చూస్తున్న భార్యా భర్తలు ఈ ఆలయంలోని మహాదేవుడికి పూజ చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే వారికి తప్పకుండా పిల్లలు పుడతారట.

ఇక్కడ శివుడు అకాల మృత్యు భయం నుంచి ఉపశమనం ఇస్తాడట. అందుకే ఆయనను కల్ముక్తేశ్వర్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో శివుడిని పూజించి బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా అకాల మరణ భయం తొలగిపోతుందని, దీర్ఘాయుష్షు, సంతోషకరమైన జీవితాన్ని పొందుతాడని నమ్మకం. ప్రస్తుత మార్కండేయ మహాదేవ ఆలయం మార్కండేయ మహర్షి శివుడిని పూజించి అమరత్వం అనే వరం పొందిన ప్రదేశంలోనే నిర్మించబడిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయం శివ భక్తులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం గురించి మహాభారతం వంటి పురాతన గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది.

  Last Updated: 25 Apr 2025, 11:24 AM IST