మామూలుగా శని దేవుడిని కర్మధాత అని పిలుస్తుంటారు. అంటే మనం చేసే మంచి చెడుల బట్టి ఫలితాలను ఇస్తాడని భక్తులు నమ్ముతుంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను అందించడంతో పాటు ఆయన అనుగ్రహం కలుగుతుందట. చెడు పనులు చేస్తూ, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడే వారిని ఆయన కష్టాలకు గురి చేస్తాడట. అలా మంచి చెడులను కలిపి ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు.
శని దేవుడు జాతకంలో అశుభ స్థానం నుంచి వెళ్లిపోయే ముందు కూడా వారికి శుభాలను అందిస్తాడట. అయితే శని పీడతో బాధపడకుండా, దాని ప్రభావం తగ్గాలని అనుకుంటే కొన్ని రకాల పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతి శనివారం శని దేవుడిని ఆరాధించాలట. మీ దగ్గర్లో ఉన్న నవగ్రహాల వద్దకు వెళ్లి నల్ల నువ్వులు సమర్పించాలట. ఇవి శని భగవాణుడికి ఎంతో ప్రీతికరం అని చెబుతున్నారు. అదేవిధంగా శనీశ్వరుడికి రాళ్ల ఉప్పును కూడా సమర్పించవచ్చట. శని విగ్రహం ముందు ఇవి సమర్పించాలట.
ఏవైనా నీలం రంగు పుష్పాలను కూడా శనిదేవుడికి సమర్పించాలని, దీనితో శనిదేవుడు అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం రోజు శనీశ్వరుడిని నువ్వుల నూనెతో అభిషేకం చేసినా కూడా ఆయన కరుణా కటాక్షాలు తప్పకుండా సిద్ధిస్తాయట. మూగ జీవాలకు ఆహారం ఇవ్వాలట. పేదలకు, ముఖ్యంగా వయసులో పెద్దవారికి ఆహారం ఇవ్వాలని, ఇలా చేయడం వల్ల శని బాధల నుంచి త్వరగా విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
