Cash Gift : శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఫలమో, పుష్పమో తీసుకెళ్లడం భారత సంప్రదాయం. ఇవేవీ తీసుకెళ్లడానికి వీలు లేకుంటే జేబులో ఉన్న నగదులో ఎంతోకొంత మొత్తాన్ని కానుకగా చదివిస్తారు. శుభకార్యాల టైంలో నగదు కానుకలు ఇచ్చే వాళ్లు ఓ ఒరవడిని ఫాలో అవుతుంటారు. చివరలో రూ.1 వచ్చేలా చదివింపులు(Cash Gift) ఉంటాయి. 11 రూపాయల నుంచి మొదలుకొని రూ. 21, రూ. 51, రూ. 111 దాకా చదివిస్తారు. మరీ దగ్గరి బంధువుల శుభ కార్యాల్లో రూ. 1111 దాకా కానుకను చదివిస్తారు. అలా కానుకను చదివించిన వారి పేరు పక్కనే వారి బంధుత్వం, ఊరు, పేరు, నిక్నేమ్ ఇలా చాలా విషయాలు మీకు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు నేటికీ పెళ్లిళ్లు, పెరంటాళ్లు చేసిటప్పుడు చదివింపుల రూపంలో కానుకలు తీసుకుంటూ ఉంటారు. బంతి భోజనాలు పెట్టే సమయంలో పక్కనే ఓ ఇద్దరు వ్యక్తులు పుస్తకం బ్యాగ్ పట్టుకొని చదివింపులను రాస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత వచ్చిన అతిథులు తమకు తోచినంత కానుకలు చదివిచ్చి వెళ్తారు.
We’re now on WhatsApp. Click to Join
చదివింపుల్లో రూ. 10, రూ. 100, రూ. 1000 ఇలా ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా… ఎందుకు రూపాయిని అదనంగా ఇస్తారనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా ? వాస్తవానికి దీని వెనుక దాగిన లాజిక్ చాలామందికి తెలియదు. గురు, శుక్రులను ఆర్థిక బలానికి సంకేతంగా జోతిష్య శాస్త్రం భావిస్తుంది. ఆందుకే ఆ రెండు గ్రహాల ప్రభావం శుభకార్యం చేసే వారిపై ఉండాలని దీవిస్తూ ఇలా 1తో ఎండ్ అయ్యేలా నగదు కానుకలు ఇస్తారు. హిందూ సంప్రదాయంలో సంఖ్యాశాస్త్రానికి చాలా విలువ ఇస్తారు. అందుకే ఏ పని చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా న్యూమరాలజీని ఆధారంగా నిర్ణయించుకుంటారు. ఈ కానుకల విషయంలో కూడా అదే ఫాలో అవుతారు. ఎక్కువ మంది సరి సంఖ్యలను నమ్మరు. బేసి సంఖ్యలను ఎక్కువ విశ్వసిస్తారు. వాటితోనే మేలు జరుగుతుందని అనుకుంటారు. అందుకే 1 అనే అంకె ఉండేలా కానుకల్లో చూసుకుంటారు. మరికొందరు సంఖ్య మొత్తాన్ని కూడిన తర్వాత వచ్చేది బేసి సంఖ్య అయి ఉండాలని భావిస్తారు. నాణేలను లక్ష్మీ దేవితో పోలుస్తారు కొందరు. అందుకే నోట్లతోపాటు నాణేలు ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీ ఇంట్లో ఐశ్వర్యం తులతూగుతుందని నమ్మకం.