Bhagavata – Miracle : భాగవతం సుందరం.. సుమధురం..
శ్రీకృష్ణ భగవానుడిపై భాగవతంలో ఉండే ప్రవచనాలన్నీ సుమధురామృతాలు..
అందులోని ప్రతీ వాక్యం మోక్షానికి మార్గం చూపే దిక్సూచిలా ఉంటుంది.
శ్రీకృష్ణ భగవానుడిపై పూర్తి నమ్మకంతో.. పూర్తి శ్రద్ధతో భాగవతాన్ని పఠిస్తే మానవ జన్మ ధన్యమవుతుంది.
అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి.. ఇది నిజమని నిరూపించే ఓ ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు.. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూలన దాక్కున్నాడు.ఆ టైంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణనపై భాగవతంలోని వాక్యాలను చదువుతున్నారు. తల్లి యశోద తన బిడ్డ కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు. దొంగ కూడా మూలలో నిలబడి అదంతా ఆసక్తిగా వింటున్నాడు.భాగవత ప్రవచనం పూర్తయ్యే దాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని దొంగ అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని చెప్పాడు. దీనికి దొంగ రిప్లై ఇస్తూ.. ‘మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.
బ్రాహ్మణుడు ఆలోచించి.. ‘‘బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు’’ అని ఆ దొంగ నుంచి తప్పించుకోటానికి చెప్పాడు. దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నదీ తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి సంగీతం వినిపించింది. ఇద్దరు పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు’ అని అనుకున్నాడు.ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తరువాత చూస్తే.. దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని.. ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి, జరిగిందంతా చెప్పాడు.
ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటుకు వెళ్లగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని.. ‘‘నీవు ఒక దొంగని అనుగ్రహించావు .. నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘‘ నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు.. కానీ దొంగ.. నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం , సమర్పణ “శరణాగతి” ఉన్న చోటే నేను ఉంటాను” అని (Bhagavata – Miracle) చెప్పాడు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.