Site icon HashtagU Telugu

Spirituality: సమస్యల ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో మీకు తెలుసా?

Spirituality (2)

Spirituality (2)

మామూలుగా జాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి అలాగే మీరు ఎదుర్కొనే సమస్యలను బట్టి ఈరోజు ఏ దేవుడికి పూజ చేస్తే అనుకూలం అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం రోజు కంటికి చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు అలాగే వివాహం సంతానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు పూజ చేయడం మంచిది.. వ్రతం ఆచరిస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు. సూర్య భగవానుడు రోజుగా చెప్పే ఆదివారం రోజు సూర్యారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే గ్రహాల ప్రతికూల ప్రభావాలు మీపై ఉండమని చెబుతున్నారు. అయితే ఈ వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం రోజు ప్రారంభించి కనీసం 12 వారాల పాటూ విధిగా ఆచరించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకు స్నానం ఆచరించి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు.

ఇకపోతే సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు. ఇక చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం చాలా మంచిది అని చెప్పాలి. సోమవారం వ్రతం చేయాలి అనుకుంటే శ్రావణమాసం వైశాఖం కార్తీకం మార్గశిర మాసాల్లో పౌర్ణమి ముందు వచ్చే సోమవారం ప్రారంభించి 16 వారాలు విధిగా ఆచరించాలని చెబుతున్నారు. ఈ వ్రతం చేయాలి అనుకున్న వారు చెరువు, నది,కొలను, సముద్రం లేదంటే బావి స్నానాలను ఆచరించి రోజంతా పంచాక్షరి మంత్రాలను జపించాలట. బిల్వపత్రాలతో శివుడిని పూజించడంతోపాటు చంద్రుడి అష్టోత్తరం కూడా పఠించాలని చెబుతున్నారు. చంద్రుడి ప్రతికూల ప్రభావం తొలగించుకునేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరం ధరించాలట. అయితే వ్రతం ముగించే చివరివారం దంపతులకు వస్త్ర దానం చేయాలట.

అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలి అనుకున్న వారు మంగళవారం వ్రతం ఆచరించాలట. జాతకంలో కుజ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగించుకునేందుకు మంగళవారం వ్రతం చేస్తారు. ఏ నెలలో అయినా పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం వ్రతం ప్రారంభించి 21 వారాలు ఆచరించాలట. మంగళవారం వ్రతం చేస్తే ఆరోగ్యం, ఆయుష్షు, శత్రుజయం ఉంటుంది. దీర్ఘకాలిన వ్యాధులు, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ పూజలో భాగంగా ఆంజనేయుడిని ధ్యానంతో పాటుగా కుజాష్టోత్తరం పఠించాలట.

బుధవారం రోజు వ్రతం ఆచరిస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందట. అలాగే బుధుడు ప్రతికూల ప్రభావం తగ్గించుకోవడం కోసం బుధవారం వ్రతం ఆచరించాలని చెబుతున్నారు. విద్యా ఉద్యోగం వ్యాపారంలో వెనుకబడిన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలట. ఏ నెలలో అయిన పౌర్ణమి ముందు వచ్చే బుధవారం వ్రతం ప్రారంభించి 21 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలట. బుధవారం వ్రతాన్ని ఆచరించేవారు వంటకాల్లో ఉప్పు తినకూడదటీ. ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు, పానీయాలు మాత్రమే స్వీకరించాలట. పెసలు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం గురువారం రోజు వ్రతం ఆచరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చట. దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు లేదా తమకు నచ్చిన గురువును ఈ రోజు ఆరాధించవచ్చట. గురుగ్రహం ప్రతికూల ప్రభావం ఉంటే విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అన్నీ వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. అడుగడుగునా అవమానాలు, అవహేళనలు తప్పవు. అందుకే బృహస్పతిని ప్రశన్నం చేసుకునేందుకు గురువారం వ్రతం ఆచరించాలని చెబుతున్నారు. ఏ నెలలో అయినా శుక్లపక్షంలో గురువారం ఈ వ్రతాన్ని ప్రారంభించి 16 వారాలు ఆచరించాలట. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పసుపు పూలతోనే పూజ చేయాలట. గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పు వినియోగించరాదు. ఒక్కపూటే మాత్రమే భోజనం చేయాలని చెబుతున్నారు.

శుక్రవారం దుర్గాదేవి లక్ష్మీదేవి సంతోషమాత గాయత్రీ దేవి ఇలా చాలామంది అమ్మవార్లకు అంకితం చేయబడింది. ఇక అమ్మ వార్ల అనుగ్రహం కలగడం కోసం శుక్రవారం రోజు వ్రతాన్ని ప్రారంభించాలట. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు ప్రారంభించి 16 వారాలు చేయాలట. ఈ వ్రతం ఆచరించే వారు కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేయాలని చెబుతున్నారు. శ్రీసూక్త పారాయణ చేస్తూ తెలుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలట.

అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం శనివారం వ్రతం చేయాలని చెబుతున్నారు. జాతకంలో ఉండే రాహు కేతు శని సంబంధిత దోషాలు తొలగిపోవడం కోసం శనివారం వ్రతాన్ని ప్రారంభించాలట. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చి తొలి శనివారం రోజు ప్రారంభించి ఆ తర్వాత 19 వారాలపాటు ఆచరించాలట. నువ్వుల నూనె లేదా ఆవునెయ్యితో దీపం వెలిగించి నీలం రంగు పూలతో పూజించాలి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ఉపవాసం లేదంటే ఒకపూట భోజనం చేయాలి. ఈ వ్రతం పూర్తైన ఆఖరివారం నలుపు రంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం దానం ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.