Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది..?

తాత్పర్యము: శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు కాడి పశువుగా పడి వుంటుందట.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 09:00 AM IST

నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు

తాత్పర్యము: శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు కాడి పశువుగా పడి వుంటుందట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి…సకలైశ్వర్యములు సమకూరతాయి.

నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలంతో అభిషేకించినా శివయ్య సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు ఇట్టే నెరవేరస్తాడు. అందుకే ఆయనను భోళా శంకరుడు అంటారు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటారు. అలా వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత ఉంది. అంతేకాదు ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.మన పెద్దలు విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. శివుడ్ని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం.

1.ఆవు పాలతో- సర్వ సౌఖ్యాలు
2.ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం
3.ఆవు నెయ్యి- ఐశ్వర్యాభివృద్ధి
4.చెరకు రసం (పంచదార)- దుఃఖ నాశనం, ఆకర్షణ
5. తేనె-తేజో వృద్ధి
6. భస్మ జలం-మహా పాప హరణం
7. సుగంధోదకం – పుత్ర లాభం
8. పుష్పోదకం- భూలాభం
9. బిల్వ జలం – భోగ భాగ్యాలు
10.నువ్వుల నూనె- అపమృత్యు హరణం
11. రుద్రాక్షోదకం- మహా ఐశ్వర్యం
12. సువర్ణ జలం-దరిద్ర నాశనం
13. అన్నాభిషేకం- సుఖ జీవనం
14. ద్రాక్ష రసం- సకల కార్యాభివృద్ధి
15. నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి
16. ఖర్జూర రసం- శత్రు నాశనం
17. దూర్వోదకం- ద్రవ్య ప్రాప్తి
18. ధవళొదకమ్- శివ సాన్నిధ్యం
19. గంగోదకం-సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
20. కస్తూరీ జలం-చక్రవర్తిత్వం
21. నేరేడు పండ్ల రసం-వైరాగ్య ప్రాప్తి
22. నవరత్న జలం- ధాన్య గృహ ప్రాప్తి
23. మామిడి పండు రసం- దీర్ఘ వ్యాధి నాశనం
24. పసుపు, కుంకుమ- మంగళ ప్రదం
25. విభూది- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

విష్ణువు అలంకారప్రియుడైతే…శివుడు అభిషేక ప్రియుడు. శివుడు అభిషేకానని చాలా ప్రియంగా భావిస్తుంటాడు. కాబట్టి అభిషేక ప్రియుడు అంటారు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. అందుకే శివార్చనల అభిషేకం చాలా ముఖ్యమైంది. గంగ జలరూపమైన…జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి.