పండగల వేళ జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి తన పంజా విసరదని అందరూ అనుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 08:07 PM IST

కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి తన పంజా విసరదని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తాజాగా కొత్త కరోనా వేరియంట్ అయిన బీఎఫ్7 విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది.

పండగల సీజన్ వస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. ఇటీవలె ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ళ్లీ ఆందోళ‌నలు కొనసాగుతున్నాయి. చైనాలో క‌రోనా సంక్రమణ రేటు భారీగా పెరుగుతోంది. అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల అధికార యంత్రాంగంతో అత్య‌వ‌స‌ర స‌మీక్ష స‌మావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇత‌ర దేశాల్లో క‌రోనా వ్యాప్తి పెరుగుతోందని, క‌రోనా వైర‌స్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూసిన త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మన దేశంలో మహమ్మారి ఇంకా ముగియలేదని, అందుకే అందరూ అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అలాగే నిఘా చర్యలను కూడా పెంచాలని అధికారులకు ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు.

అంతర్జాతీయ విమానాశ్రయాలలో కోవిడ్ -19 పరీక్ష, జన్యుక్రమాన్ని పెంచాలని, ముఖ్యంగా సెలవు సీజన్ సమీపిస్తున్నందున అన్ని సమయాల్లో కోవిడ్ పరీక్షలు నిర్విరామంగా చేపట్టాలని సూచించారు. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరూ పాటించాలని తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవియా అధికారులు, ప్రజారోగ్య నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవడంతో పాటుగా కోవిడ్-19 కేసులు పెరిగితే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.