Salman Khan : ముంబైలోని బాంద్రాలో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై ఏప్రిల్ 14న ఇద్దరు దుండగులు కాల్పుల జరిపిన ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది. ఈ కేసులో దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలోనే ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల వ్యవహారంలో సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ను మూడు గంటల పాటు, అర్బాజ్ ఖాన్ వాంగ్మూలాన్ని రెండు గంటల పాటు పోలీసులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సల్మాన్ ఖాన్ సోదరులిద్దరినీ పోలీసులు 150కిపైగా ప్రశ్నలు అడిగారు. కాల్పులు జరిగిన టైంలో సల్మాన్ ఖాన్(Salman Khan) తండ్రి సలీం ఖాన్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే వృద్ధాప్యం కారణంగా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేదు. భవిష్యత్తులో కేసు విచారణలో అత్యవసరం అని భావిస్తే సలీం ఖాన్ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తామని పోలీసు అధికార వర్గాలు వెల్లడించాయి.
We’re now on WhatsApp. Click to Join
‘‘నా ప్రాణాలకు ముప్పు ఉందని ఆ ఘటనతో గుర్తించాను’’ అని పోలీసులకు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో సహాయం చేసినందుకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆ రోజు (ఏప్రిల్ 14న) ఉదయం నేను గాఢనిద్రలో ఉన్నాను. అంతకుముందు రోజు అర్ధరాత్రి నేను బాగా అలసిపోయి నిద్రపోయాను. అందువల్ల ఏప్రిల్ 14న ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాను. బైక్పై మా ఇంటి దగ్గరికి వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దాలు విని నేను నిద్ర నుంచి మేల్కొన్నాను’’ అని సల్మాన్ ఖాన్ చెప్పారు.
‘‘దుండగులు కాల్పులు జరపడంతో కొన్ని బుల్లెట్లు వచ్చి మా ఇంటి బాల్కనీకి తగిలాయి. ఆ సౌండ్ నాకు స్పష్టంగా వినిపించింది. ఆ తర్వాత నేను బాల్కనీకి వెళ్లి చూశాను. అప్పటికి ఎవరూ కనిపించలేదు’’ అని సల్మాన్ ఖాన్ తెలిపారు. ఈక్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. ‘‘లారెన్స్ బిష్ణోయ్ ముఠా నియమించిన షూటర్లు సల్మాన్ ఖాన్ను చంపడానికి కుట్ర చేశారని.. దానిలో భాగంగానే ఇంటిపై కాల్పులు జరిపారు’’ అని తెలిపారు. కాగా, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. విక్కీ గుప్తా, సాగర్ పాల్, అనూజ్ థాపన్తో పాటు పంజాబ్లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనూజ్ థాపన్ పోలీసు కస్టడీలో మరణించాడు.