బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు టీవీ సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి సంచిత ఉగలే (22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబై శివారులోని నాలాసోపరాలో గల తన నివాసంలో ఆదివారం రాత్రి ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని తనువు చాలించారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీనిని ఆత్మహత్యగా ధ్రవీకరించారు.
పోలీసుల కథనం ప్రకారం, జూన్ 14వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల మధ్య సంచిత తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని చూసేసరికి, ఆమె చీరతో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సంచిత ‘కుంకుమ్ భాగ్య’, ‘దిల్వాలీ దుల్హా లే జాయేంగే’, ‘వాగ్లే కీ దునియా’ వంటి ప్రజాదరణ పొందిన సీరియళ్లతో పాటు ‘ఛావా’ అనే చిత్రంలోనూ నటించారు. ఆమె ఆకస్మిక మరణవార్తతో టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అయితే, ఆమె గత కొంతకాలంగా కుంగుబాటుతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఉల్లాసంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడం గమనార్హం.
ప్రస్తుతం పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులను, సహోద్యోగులను విచారిస్తున్నారు.
