ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భారతీయ సినీ రంగంలో ఒక మహోన్నత వ్యక్తిగా భారతీరాజాను అభివర్ణించారు.
సినీ రంగానికి భారతీరాజా చేసిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్టూడియోలకు పరిమితమైన కథలను గ్రామాలకు తీసుకెళ్లిన దర్శకుడిగా భారతీరాజా గుర్తింపు పొందారు. సాధారణ ప్రజల జీవితాలు, భావోద్వేగాలు, కష్టాలను ఆయన సినిమాలు ప్రతిబింబించాయి. తమిళ సినిమాకు కొత్త శైలిని పరిచయం చేసిన దర్శకుల్లో ఆయన ముందుంటారు. 1977లో విడుదలైన ’16 వియతినిలే’ చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. గ్రామీణ నేపథ్యాన్ని వాస్తవికంగా చూపించినందుకు విశేష ప్రశంసలు అందుకుంది.
తర్వాత ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. గ్రామీణ కథలు, సామాజిక అంశాలు, మానవ సంబంధాల చుట్టూ తిరిగే కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. పలువురు నటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే.
భారతీరాజా మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.
