గత కొన్ని రోజులుగా నంది అవార్డ్స్(Nandi Awards) గురించి టాలీవుడ్(Tollywood) లో వివాదం నడుస్తూనే ఉంది. ప్రభుత్వాలు నంది అవార్డ్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. గతంలో పలువురు పెద్దలు రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రులని కలిసి నంది అవార్డుల గురించి మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం నిర్మాత ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్విని దత్ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి రెండు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అవార్డుల విలువ కూడా పోయింది. అసలు అవార్డులు ఇచ్చే ఆలోచనలో లేరు అని నంది అవార్డులపై, ప్రభుత్వాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో పోసాని కృష్ణమురళి, నట్టి కుమార్ వీరికి కౌంటర్లు ఇస్తూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలా గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో నంది అవార్డ్స్ వివాదం సాగుతూనే ఉంది. తాజాగా ఈ నంది అవార్డుల విషయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో దర్శకరత్న దాసరి విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. దాసరి జయంతి సందర్భంగా తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ ఈ నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరపున ఎవరూ ప్రభుత్వాన్ని అడగలేదు. ఎలాంటి అభ్యర్థనలని పంపలేదు. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరు. కొందరు మీడియా కనిపిస్తే ఉత్సాహంగా మాట్లాడతారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డులు కచ్చితంగా ఇస్తాం అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారినా వచ్చే సంవత్సరం నంది అవార్డులు ఇస్తామనడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Krithi Shetty: నెటిజన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కృతి శెట్టి.. నాగచైతన్య నాకేం సక్సెస్ ఇవ్వలేదంటూ?