Salman Khan : 2022 మే 29న పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య జరిగింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత.. సరిగ్గా అదే స్టైల్లో సల్మాన్ ఖాన్ను మర్డర్ చేసేందుకు భారీ కుట్ర జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ను హత్య చేసే లక్ష్యంతోనే ఈ ఏడాది ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారని గుర్తించారు. ఈమేరకు సంచలన వివరాలతో నవీ ముంబై పోలీసులు 350 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు. పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే కారులో ఉండగా సల్మాన్ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స్కెచ్ గీసిందని విచారణలో వెల్లడైంది. సినిమా షూటింగ్లకు, పన్వేల్ ఫామ్హౌస్కు కారులో రాకపోకలు సాగించే టైంలో సల్మాన్పై(Salman Khan) కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నారని గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
సల్మాన్ ఖాన్ను హతమార్చేందుకు రూ.25 లక్షలకు కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు ఐదుగురు నిందితులను విచారించగా తెలిసింది. ఇందుకోసం 2023 ఆగస్ట్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కొన్ని నెలల పాటు ప్లానింగ్స్ చేశారని తేలింది. ఇందుకోసం నిందితుల ముఠా ఏకే -47, ఏకే-92, ఎం16 రైఫిల్స్ వంటి ఆయుధాలను పాకిస్తాన్ నుంచి కొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను దుండగులు వాడారు. సల్మాన్ ఖాన్పై దాడి చేసేందుకు కూడా ఆ తుపాకీని వాడాలని వాళ్లు భావించారని విచారణలో తేలింది. సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనకు ముందు ఆయన కదలికలను ట్రాక్ చేసేందుకు దాదాపు 70 మందితో రెక్కీ నిర్వహించారని ఛార్జిషీట్లో పోలీసులు ప్రస్తావించారు. సల్మాన్ను హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొనడం సంచలనాత్మకం. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్స్టర్లు గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాలు అందిన తర్వాత సల్మాన్ కారుపై దాడి చేయాలని భావించినట్ల విచారణలో వెల్లడైంది. సల్మాన్ ఖాన్ను హత్య చేసిన తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు మర్డర్స్ను పంపించేందుకు కూడా దుండగులు ప్లాన్ను రెడీగా ఉంచారని పోలీసులు గుర్తించారు.
ఇంటెలీజెన్స్ వర్గాల సమాచారం, నిందితుల మొబైల్ ఫోన్ల సమాచార విశ్లేషణ, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసిన విధానం, టవర్ లొకేషన్స్, ప్రత్యక్ష సాక్షులతో ఆడియో, వీడియో కాల్స్ వంటి వాటి ఆధారంగా దర్యాప్తు బృందం ఈ వివరాలపై అవగాహనకు రాగలిగింది. ఛార్జిషీట్లో ధనుంజయ్ తాప్సింగ్, అజేయ్ కశ్యప్, గౌతమ్ వినోద్ భాటియా, వాస్పి మహమ్మద్ ఖాన్ అలియాస్ చైనా, రిజ్వాన్ హసన్ అలియాస్ జావెద్ ఖాన్, దీపక్ హవా సింగ్ పేర్లను ప్రస్తావించింది. సల్మాన్ను హత్య చేయాలని భావించిన గ్యాంగ్ సభ్యులు దాదాపు 15 నుంచి 16 మందితో వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేసుకున్నారు. ఈ గ్రూపులో అన్మోల్ బిష్ణోయ్, గోల్డీబ్రార్, అజేయ్ కశ్యప్, వినోద్ భాటియా, వాస్పి మహమ్మద్ ఖాన్, రిజ్వాన్ హసన్ ఉన్నట్లు కనుగొన్నారు.