Rashmika Mandanna: ప్రశాంతంగా ఉండనివ్వండి.. ట్రోలింగ్‌పై రష్మిక మందన్న రియాక్షన్ ఇదే..!

రష్మిక మందన్న నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా.

  • Written By:
  • Updated On - November 9, 2022 / 01:12 PM IST

రష్మిక మందన్న నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. కిరిక్ పార్టీ అనే క‌న్నడ చిత్రంతో నటించిన ర‌ష్మిక.. ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. ఆ సినిమా హిట్ కావ‌టంతో విజయ్ దేవరకొండతో నటించిన గీత గోవిందం మూవీ కూడా బ్లాక్ బ్లస్టర్ అయ్యింది. ఆ త‌ర్వాత సూపర్ స్టార్ మ‌హేష్ బాబు సరసన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో అలరించింది. గత ఏడాది పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన శ్రీవ‌ల్లిగా మార్కులు కొట్టేసింది. ఓ వైపు తెలుగు సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలలో నటిస్తోంది రష్మిక.

అయితే ఈ అమ్మడు వ్య‌క్తిగ‌త జీవితంలో కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన‌ప్పుడు రష్మిక‌ను తెగ ట్రోల్ చేశారు. త‌ర్వాత తెలుగు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్ చేస్తుందంటూ కూడా వార్త‌లు వచ్చాయి. ఈ విషయంపై కూడా ర‌ష్మిక ట్రోలింగ్‌ కు బలైంది. ఈ క‌మ్రంలో ర‌ష్మిక మంద‌న్న ట్రోల్ర్స్ తాకిడి తట్టుకోలేకపోయింది. త‌నపై ట్రోలింగ్ చేస్తున్న వారిని మర్యాదగా వేడుకుంటూ సోష‌ల్ మీడియాలో ఓ లెట‌ర్ ను పోస్ట్ చేసింది.

రష్మిక మందన్న ఇలా రాసింది. ‘గడిచిన కొన్ని రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలుగా విషయాలు కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. నిజానికి ఈ ప‌నిని ఎప్పుడో చేయాల్సింది. ఆలస్యం చేశాను. నేను న‌టిగా కెరీర్ ప్రారంభం చేసిన‌ప్ప‌టి నుంచి నన్ను ద్వేషిస్తున్నారు కొందరు. దారుణంగా ట్రోలింగ్ చేశారు మరికొందరు. వారి చేసిన పనులు న‌న్ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌టం లేదు. ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రినీ ప్రేమించాల‌ని లేదు. ఇంత‌లా ద్వేషించాల‌ని కూడా లేదు. న‌చ్చ‌క‌పోతే న‌చ్చ‌లేదు అని చెప్ప‌టంలో ఎలాంటి త‌ప్పు లేదు. అంతేకాని ఇలా ట్రోలింగ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌రినీ సంతోషంగా ఉంచ‌ట‌మే నాకు తెలుసు. అందరూ గ‌ర్వ‌ప‌డేలా న‌టించాల‌నే చేస్తున్నాను. ట్రోల్స్ ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే నేను అనుకున్న గమ్యాన్ని ఎలా సాధిస్తాను’ అని ఓ లెట‌ర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ లెట‌ర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

రష్మిక మందన్న ఇటీవల అమితాబ్ బచ్చన్ గుడ్ బై మూవీలో కనిపించింది. ప్రస్తుతం దళపతి విజయ్‌తో వరిసు షూటింగ్‌లో ఉంది. ఆమె హిందీ చిత్రం మిషన్ మజ్ను థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ రెండు వారాల్లో ప్రారంభంకానుంది.