Ramcharan Trivikram : చరణ్ – త్రివిక్రమ్’ కాంబో మూవీ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు

  • Written By:
  • Publish Date - February 12, 2022 / 11:09 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఎప్పటినుంచో వీరి కలయికలో సినిమాను ఆశిసిస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించారు ‘భీమ్లా నాయక్’ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అవును, మీరు విన్నది నిజమే. త్వరలోనే ‘చరణ్ – త్రివిక్రమ్’ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. చరణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తనదైన శైలిలో కథను రాస్తున్నారట త్రివిక్రమ్. ఎందుకంటే… వీరి కలయికలో సినిమా ప్రారంభం అయ్యే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఉంటుంది. ఎలానూ ‘ఆర్ఆర్ఆర్’ తో చరణ్ క్రేజ్ మరింత పెరిగే చాన్స్ అయితే ఉంది. దీంతో రామ్ చరణ్ తో తదుపరి పాన్ ఇండియా మూవీ అంటే… అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే, చిత్ర నిర్మాత నాగవంశీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు వరుస సినిమాలు చేస్తూ.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. తాజాగా ఈ బ్యానర్లో ‘డీజే టిల్లు’ విడుదలైన సంగతి తెలిసిందే. నెక్ట్స్ మూవీగా ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, ఎవరికీ కూడా అలా అనిపించదు. అంతగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్పులు, చేర్పులు చేశారు. మళ్లీ పవన్ తో మరో సినిమా చేయాలనుంది. ఇదే విషయమై పవర్ స్టార్ తో మాట్లాడాలని అనుకుంటున్నాను అని నాగవంశీ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలానే తనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టమని .. త్వరలోనే తన సితార బ్యానర్లో చరణ్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చరణ్ హీరోగా చేసే సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు నాగవంశీ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్, ఆ తరువాత ఎన్టీఆర్ తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు నాగవంశీ.

‘చరణ్ – త్రివిక్రమ్’ కాంబోలో సినిమా ఫిక్స్ అవడంతో మెగా అభిమానులకు ఇక పండుగే అని చెప్పాలి. త్రివిక్రమ్ సినిమాలన్నీ కూడా మాంచి కామెడీతో పాటు, హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంటాయి. హీరోలను సరికొత్తగా ప్రెజెంట్ చేయడం ఈ మాటల మాంత్రికుడిగి వెన్నతో పెట్టిన విద్య. మరి సితార బ్యానర్లో చేయబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడో అన్నది చూడాలి.