Site icon HashtagU Telugu

Ram Gopal Varma: మంత్రి పేర్ని నానితో ముగిసిన సమావేశం

Template (69) Copy

Template (69) Copy

అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. అనంతరం వర్మ మాట్లాడుతూ, ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకించానని వెల్లడించారు. ఏపీలో ఉన్న తక్కువ టికెట్ ధరలు దేశంలో మరెక్కడా లేవని అన్నారు. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితిని వివరించానని తెలిపారు. ఓ సినీ నిర్మాతగా ప్రభుత్వానికి తన అభిప్రాయాలు చెప్పానని వర్మ అన్నారు.

టికెట్ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానని, మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావనకు తీసుకువచ్చారని వర్మ పేర్కొన్నారు. టికెట్ ధర పెరిగితే ప్రజలు ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని వెల్లడించారు. టికెట్ ధర తగ్గిస్తే ఈ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుందని తాను చెప్పానని అన్నారు. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతలపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించానని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

చర్చలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. అయితే సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినిమా పరిశ్రమపై ఉందని వర్మ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం తనకుందని వర్మ పేర్కొన్నారు. చర్చలు జరిగిన తీరుపై 100 శాతం సంతృప్తిగా ఉందని తెలిపారు.

కాగా, పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి అగ్రనటులను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని తాను భావించడంలేదని వర్మ అన్నారు. ఒకరిద్దరి కోసం యావత్ చిత్రపరిశ్రమను ఇబ్బంది పెడతారని అనుకోవడంలేదని స్పష్టం చేశారు.