తిరువీర్ సినిమాలకు, ఆయన చేసే పాత్రలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తిరువీర్ మీద ఆడియెన్స్ ఓ మోస్తరు అంచనాలతో ఉంటారు. అయితే తిరువీర్ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రావడం లేదనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే తిరువీర్ ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్కి ఏ మేరకు కనెక్ట్ అవుతుంది? అన్నది చూద్దాం.
కథ
ప్రతాప్ (తిరువీర్), బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటారు. తన తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా బుజ్జమ్మని ప్రతాప్ పెళ్లి చేసుకుంటాడు. ఇక మూడు రాత్రులు గడిచిన తరువాత ప్రతాప్ మీద బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ఊరి ప్రజలందరి మధ్యలో ప్రతాప్కి ఉన్న సమస్య గురించి చెప్పకుండానే అతడ్ని వదిలేసి వెళ్తుంది. దీంతో ఊర్లో ప్రతాప్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. మరి ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటి? దాన్ని ఎలా అధిగమిస్తాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం ప్రతాప్ ఏం చేస్తాడు? చివరకు ప్రతాప్, బుజ్జమ్మ కలుస్తారా? లేదా? అన్నదే కథ.
పాపం ప్రతాప్ కథ అంతా కూడా 90వ దశకంలో జరిగినట్టుగా చూపిస్తారు. కానీ ఎక్కడా కూడా ఆ ఫీలింగ్ రాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. కట్టూబొట్టూ, యాస అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు, అతని టీం విఫలమైనట్టుగా అనిపిస్తుంది. ఇక భర్తకి ఉన్న సమస్య గురించి ఇలా పంచాయితీలో పెట్టడం ఏంటో.. అసలు సమస్యను చెప్పకుండా.. నువ్వే తెలుసుకో అని భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లడం ఏంటో.. ఈ సమస్య గురించి అమ్మకి ఎప్పుడో తెలిసినా చెప్పకుండా ఉండటం ఏంటో.. ఇలా ఎన్నో ప్రశ్నలు, లాజిక్ లేని సీన్లు సినిమాలో కనిపిస్తుంటాయి.
సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య అంత ఘాడమైన ప్రేమ ఉందా? అనే అనుమానం కలుగుతుంది. పెళ్లి, మూడు రాత్రులు, ఊరిపెద్దల సమక్షంలో పంచాయితీ, ప్రతాప్ని వదిలి బుజ్జమ్మ వెళ్లడం ఇక్కడి వరకు ఓకే అనిపించేలా ఉంటుంది. కానీ ఆ తరువాత కథనం పూర్తిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్కి కథలో ఏదో సీరియస్ మూమెంట్ ఉందన్నట్టుగా కనిపిస్తుంది.
కానీ ఆ తరువాత మళ్లీ కథ అదే మూసధోరణిలో వెళ్తుంది. ఎక్కడా కూడా కొంచెం సీరియెస్ నెస్ కనిపించదు. ఇక కుళ్లు జోకులు సహనానికి పరీక్షలా ఉంటాయి. చాలా చోట్ల గోపరాజు రమణ, అజయ్ ఘోష్ సీన్లు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఆ తిట్టుకోవడం ఏంటో.. వారిద్దరి గోల ఏంటో అన్నట్టుగా ఉంటుంది. ఇందులో ఎక్కడా కూడా ఒక్క ఎమోషనల్ బ్లాక్, ఒక్క పాత్రతో ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడానికి ఆస్కారాన్ని దర్శకుడు ఇవ్వలేకపోతాడు. హీరో సమస్యని ఆడియెన్స్ తమ సమస్యగా భావించేలా చేయగలిగితే సక్సెస్ అవుతుంది. ఆ విషయంలో పాపం ప్రతాప్ ఎక్కడో వెనకబడినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఎమోషనల్గా అనిపించదు. అంత ఎఫెక్టివ్గా కనిపించదు.
టెక్నికల్గా చూసుకున్నా కూడా అంతగా ఆకట్టుకోదు. పాటలు ఏమంత వినసొంపుగా, గుర్తు పెట్టుకునేలా ఉండవు. డైలాగ్స్ కూడా గుండెల్ని హత్తుకునేలా ఉండవు. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ ఇవేవీ కూడా సినిమాకి అదనపు హంగుల్లా కనిపించవు. నిర్మాణ విలువలు కూడా అంతగా కనిపించవు. నటీనటుల విషయానికి వస్తే తిరువీర్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. రాత్రి పూట ఓ కొత్త మనిషిలా, పగలు సాధారణ వ్యక్తిలా బాగానే ఆకట్టుకుంటాడు. పాయల్ రాధాకృష్ణ తన పాత్ర వరకు ఓకే అనిపిస్తుంది. రాశీ, అజయ్ ఘోష్ పెయిర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. గోపరాజు రమణ కారెక్టర్, అతను చేసే కామెడీ కొన్ని సార్లు ఓవర్ అనిపించొచ్చు, నచ్చకపోవచ్చు. రవి ఆంటోని, ప్రసాద్ బెహరా అక్కడక్కడ నవ్విస్తారు. మిగిలిన పాత్రలన్నీ కూడా వారి పరిధి మేరకు నటించారు.
ఓవరాల్గా పాపం ప్రతాప్.. చివరకు పాపం తిరువీర్ అనేట్టుగానే ఉంటుంది. మంచి పాయింట్లను పట్టుకుని తిరువీర్ కథల్ని ఓకే చేస్తాడు. కానీ ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టేస్తుంటుంది. ఈ పాపం ప్రతాప్ కూడా అంతే.. పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ పూర్తి స్థాయి సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోతుంది.
