మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ డివోషనల్ మూవీ ‘కన్నప్ప’. పరమ శివ భక్తుడు తిన్నడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పాపులర్ స్టార్స్ ఇతర పాత్రల్లో కనిపించారు. గతేడాది జూన్ నెలాఖరున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకులు, పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. కానీ ఎందుకనో ఫైనల్ రన్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
‘కన్నప్ప’ మూవీ 2025 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నెల 27వ తేదీకి సినిమా వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మరోసారి థియేటర్లలోకి తీసుకురావాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు. రీ-రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ”ఆ దివ్య ప్రయాణం మళ్లీ వెండితెరపైకి వస్తోంది. జూన్ 27న థియేటర్లలో ‘కన్నప్ప’ చిత్రాన్ని మరోసారి వీక్షించండి. లక్షలాది హృదయాలను తాకిన భక్తి, భావోద్వేగాలు, అద్భుతమైన దృశ్యకావ్యాన్ని మళ్లీ అనుభూతి చెందండి. ఆ మహోన్నత గాథను వీక్షించండి. విశ్వాసాన్ని అనుభవించండి. భక్తిని ఆస్వాదించండి. హర్ హర్ మహాదేవ్” అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
‘కన్నప్ప’ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. విష్ణు టైటిల్ రోల్ పోషించగా.. రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించారు. కిరాతుడిగా మోహన్ లాల్, మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు.. శివ పార్వతులుగా అక్షయ్ కుమార్ – కాజల్ నటించారు. విష్ణుకి జోడీగా ప్రీతి ముకుందన్ నటించగా.. శరత్ కుమార్, మధుబాల, శివ బాలాజీ, బ్రహ్మానందం, కౌషల్ మండా, రఘుబాబు, సప్తగిరి, ముఖేష్ రుషి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
‘కన్నప్ప’ కథేంటంటే.. ఒక చిన్న గూడెంలో పుట్టిన తిన్నడు (మంచు విష్ణు) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) పోషణలో పెరుగుతాడు. అయితే చిన్నప్పుడు జరిగిన ఒక ఘటనతో తిన్నడు నాస్తికుడిగా మారిపోతాడు. విలువిద్యలో ఆరితేరిన అతడు.. తమ ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. అయితే అమ్మవారికి బలి ఇవ్వడాన్ని వ్యతిరేకించి గూడెం నుంచి వెలివేయబడతాడు. నాస్తికుడిగా గూడెం నుంచి వెళ్లిన తిన్నడు.. పరమ శివ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? భక్తుడిగా మారిన తర్వాత ఏం చేశాడు? శివుడి కోసం అతడు చేసిన త్యాగం ఏంటి? తిన్నడి ప్రయాణంలో రుద్ర, మహాదేవశాస్త్రి పాత్రల ప్రాముఖ్యత ఏంటి? అనేది ఈ సినిమా మిగిలిన కథ.
‘కన్నప్ప’ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీని పూర్తిగా న్యూజిలాండ్లో షూట్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడం, ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ఎందుకనో ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు రీ-రిలీజ్లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
