ఇటీవల కొన్నాళ్ల క్రితం నటుడు మంచు మనోజ్(Manchu Manoj) భూమా మౌనికని(Bhuma Mounika) రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏ ఈవెంట్, సినిమా ఫంక్షన్ ఉన్నా ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. దీంతో మౌనిక, మనోజ్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఇటీవలే మౌనిక తల్లి కాబోతుందని మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు మనోజ్.
తాజాగా మనోజ్, మౌనిక కలిసి మరో ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు. మనోజ్, మౌనిక కలిసి ఓ కొత్త బిజినెస్ ప్రారంభించారు. ‘నమస్తే వరల్డ్'(Namasthe World) అనే బ్రాండ్ తో పిల్లల కోసం బొమ్మలు(Toys) తయారు చేస్తున్నారు ఈ జంట. ముడి సరుకులు అన్ని తెప్పించి ఇక్కడే హైదరాబాద్ లోనే బొమ్మలు తయారు చేయిస్తున్నారు. తాజాగా ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో నమస్తే వరల్డ్ టాయ్స్ షో రూమ్ ఓపెన్ చేశారు. అలాగే పలు ప్రముఖ టాయ్స్ కంపెనీలతో కలిసి కూడా తమ టాయ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు.
ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో నమస్తే వరల్డ్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ముందు అనుకున్న ఆలోచన ఇది. కరోనా టైంలో బాగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసి ప్రొడక్షన్ మొదలుపెట్టాము. ఇవి పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా బొమ్మలు. నాలుగున్నర ఏళ్ళు దీని కోసం ఇద్దరం కలిసి కష్టపడ్డాం. ఇంటిని ఆఫీస్ గా మార్చుకొని వర్క్ చేసాము అని తెలిపాడు .
ఇక మౌనిక మాట్లాడుతూ.. పిల్లల కోసం వచ్చిన ఆలోచన నుంచే ఈ నమస్తే వరల్డ్ ముందుకి వచ్చింది. నా భర్త మంచు మనోజ్ దీనికి పూర్తి సహకారం అందించాడు. భారతీయ హస్తకళ నైపుణ్యం, మహిళా సాధికారతతో చాలా మందికి ఈ నమస్తే వరల్డ్ ద్వారా ఉపాది కల్పించి, ఈ బొమ్మలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాము. బొమ్మల్లో మన భారతీయ కల్చర్ కనపడేటట్టు, మన ఇండియన్ సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ తో కూడా త్వరలోనే బొమ్మలు తయారు చేస్తామని తెలిపింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు ఈ కొత్త జంట మొదలు పెట్టిన కొత్త బిజినెస్ సక్సెస్ అవ్వాలని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Mokshagna Cinema: పవర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ