Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరాప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది.
హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్న థియేటర్లు
ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ చిత్రం హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. పండుగ రోజున ఉన్న అన్ని షోలకు సంబంధించిన టిక్కెట్లు ముందుగానే అమ్ముడయ్యాయి. మెగాస్టార్ మానియా ఏ స్థాయిలో ఉందంటే ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన డిమాండ్కు సరిపడా షోలు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
Also Read: హీరోగా రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!
ఇతర సినిమాలకు ప్లస్!
ఈ సంక్రాంతికి మరీ ఎక్కువ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్ల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ‘మన శంకర వరాప్రసాద్ గారు’ చిత్రానికి ఉన్న డిమాండ్కు థియేటర్లలో ఉన్న సీట్ల సామర్థ్యానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. చాలా చోట్ల మెగాస్టార్ సినిమా టిక్కెట్లు దొరకని ప్రేక్షకులు నిరాశతో పండుగ పూట ఖాళీగా వెనుదిరగలేక ఇతర సంక్రాంతి సినిమాలకు వెళ్తున్నారు. దీనివల్ల ఈ చిత్రం పరోక్షంగా తోటి సినిమాల వసూళ్లకు కూడా భారీగా తోడ్పడుతోంది.
ముందుగానే బుక్ అవుతున్న టిక్కెట్లు
ప్రస్తుత క్రేజ్ చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రెండు, మూడు రోజులకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మెగాస్టార్ తన బాక్సాఫీస్ స్టామినాతో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం అతి త్వరలోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెలవుల తర్వాత కూడా ఇదే స్థాయి వసూళ్లను రాబడితే ఈ సినిమా మరిన్ని సంచలన రికార్డులను తిరగరాయడం ఖాయం. చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను మెప్పించడంలో వంద శాతం విజయం సాధించారు.
