Mammootty: అంచనాలు పెంచుతున్న మమ్ముట్టి ‘భ్రమయుగం’ మూవీ, విడుదలపై కీలక అప్డేట్

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 08:55 PM IST

Mammootty: ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్నవిషయం తెలిసిందే. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది.

ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్లలో సీటు అంచున కూర్చొని ఈ సినిమా చూడటం ఖాయమనేది ట్రైలర్ తో అర్థమైంది. అలాగే ట్రైలర్ సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది.

‘భ్రమయుగం’ కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించారు. అయితే మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.