తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలను నటి, పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను, వైవాహిక జీవితంలో నాలుగు నెలల బిడ్డను కోల్పోయిన తనకు ఎడబాటు బాధ తెలుసని, తాను ఎవరి సంసారాన్ని కూల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయం రవి తన నిర్ణయాలు తను తీసుకోగల వ్యక్తి అని స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న హత్యా బెదిరింపులు, ట్రోలింగ్ను తట్టుకోలేక తాను చెన్నై నగరాన్ని, ప్రాణ సమానమైన సంగీతాన్ని వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), అతని భార్య ఆర్తి రవిల వైవాహిక బంధం ముగింపునకు రావడానికి తానే ప్రధాన కారణమంటూ వస్తున్న ఆరోపణలపై పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఎట్టకేలకు మౌనం వీడారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలు, హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే చెన్నై నగరంతో పాటు తనకు ప్రాణ సమానమైన సంగీతాన్ని కూడా వదులుకుని వెళ్లిపోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా ప్రకటించారు.
ఒకరి సంసారాన్ని నేనెందుకు కూలుస్తాను?
ఇటీవల కోలీవుడ్లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కెనీషా పాల్గొని, తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయానని, మైనర్గా ఉన్నప్పుడు బంధువుల చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లకే వివాహం జరిగినా.. కేవలం నాలుగు నెలల గర్భంతో ఉన్న సమయంలో భర్త తన స్నేహితుల ముందే దారుణంగా కొట్టడంతో కడుపులోనే బిడ్డ చనిపోయిందని ఎమోషనల్గా చెప్పుకొచ్చారు. తల్లిని, తండ్రిని, కడుపున పుట్టిన బిడ్డను కోల్పోయి, ఆ ఎడబాటు బాధను అనుభవించిన తాను.. మరొకరి జీవితాన్ని నాశనం చేయాలని ఎలా అనుకుంటానని ప్రశ్నించారు. రవి చిన్నపిల్లవాడు కాదని, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. లీగల్ నోటీసులు పంపినప్పటికీ కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసత్య వార్తలతో డబ్బులు సంపాదించుకునే వారు సమాజంలో ఉన్న ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
నాది కాని యుద్ధంలో నేను నిలబడలేను.
గతంలో ఆర్తి రవి సైతం తమ విడాకుల వెనుక మూడో వ్యక్తి ప్రమేయం ఉందంటూ పరోక్షంగా కెనీషా వైపు వేలెత్తి చూపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. వీటన్నింటికీ ముగింపు పలుకుతూ కెనీషా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. “నేను ఈ వ్యవహారంలోకి కేవలం మంచి ఉద్దేశంతో, సహాయం చేయాలనే ప్రేమతోనే అడుగుపెట్టాను. ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తిని రక్షించడానికి నా జీవితాన్ని ధారపోశాను. కానీ, అబద్ధాలు, హంగామాలు రాజ్యమేలే ఈ ప్రపంచంలో మంచికి చోటు లేదని నాకు అర్థమైంది. ఒక మంచి మనిషికి అండగా నిలబడాలని అనుకోవడం నేను చేసిన మూర్ఖత్వం” అని పేర్కొన్నారు.
ఇకపై అతను పూర్తిగా మీకే సొంతం. నాది కాని ఈ యుద్ధ రంగంలో నిలబడి నేను పోరాడలేను. సమర్థనలు, వివరణలు ఇచ్చుకునే ఓపిక నాకు లేదు. త్యాగాల కంటే అల్లిన కథలనే జనాలు నమ్ముతారు కాబట్టి, మీరనుకున్న విజయాన్నే మీకే వదిలేస్తున్నాను అని తెలిపారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా చెన్నై నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నానని, సంగీతాన్ని, సోషల్ మీడియా ఖాతాలను కూడా శాశ్వతంగా మూసివేస్తున్నానని స్పష్టం చేస్తూ, ఇకనైనా తనకు వ్యక్తిగత ప్రశాంతతను ఇవ్వాలని కోరారు. ఈ ప్రకటనతో జయం రవి, కెనీషాల మధ్య ఉన్న అనుబంధానికి పూర్తిగా తెరపడినట్లయిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
