Vijay Sethupathi సాధారణంగా సినీ పరిశ్రమలో తమ వైఫల్యాలను దాచుకోవాలని చూసే వారు ఎక్కువగా ఉంటారు. కానీ తమిళ నటుడు విజయ్ సేతుపతి మాత్రం తాను నిర్మాతగా మారి తీసిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం లాభాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల మీద ఉన్న మక్కువతోనే తాను సినిమాలు తీశానని ఆయన స్పష్టం చేశారు.
నిర్మాతగా విజయ్ సేతుపతి తన ప్రయాణాన్ని ‘సంగుతేవన్’ అనే చిత్రంతో ప్రారంభించగా, అది మధ్యలోనే ఆగిపోవడంతో సుమారు రూ. 1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆయన తన సొంత బ్యానర్పై నిర్మించిన ఆరెంజ్ మిఠాయి, మేర్కు తోడర్చి మలై, జుంగా, లాభమ్ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయినప్పటికీ, మనసుకు నచ్చిన కథలను వెండితెరకు పరిచయం చేశానన్న తృప్తి తనకు ఉందని, ఆ సినిమాల విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే, ప్రస్తుతం ఆయన డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. విజయ్ సేతుపతి నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘కాట్టాన్’ అనే వెబ్ సిరీస్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది.
