గత నాల్గు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Telugu States Floods ) పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లు , రైల్వే ట్రాక్ లు , బ్రిడ్జ్ లు , భవనాలు , పంటపొలాలు, ఇల్లులు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వరదల కారణంగా మృతి చెందారు. ఇక విజయవాడ నగరం గురించి ఎంత చెప్పిన తక్కువే..30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది.
చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రసీమ ముందుకు వస్తుంది. గతంలో పలు విపత్తులు ఎదురైనప్పుడు తమ వంతు సాయం చేసిన చిత్రసీమ..ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల కోసం తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vijayanthi Movies) ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందిస్తూ తమ సానుభూతి తెలియజేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం అందజేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ఎస్. రాధాకృష్ణ, ఎస్ నాగవంశీలు సంయుక్తంగా తమ హారిక, హసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ తరుపున ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 లక్షలు, తెలంగాణలకు రూ.25 లక్షల చొప్పున మొత్తంగా రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. వీరి బాటలోనే మిగతా హీరోలు , నిర్మాతలు కూడా తమ వంతు సాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also : CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్