Pushpa Part 2 : ‘పుష్ప’ పార్ట్-2 విడుదల ఎప్పుడంటే..?

'పుష్ప' ది రైజ్ పార్ట్ 1 తో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు బన్నీ.

  • Written By:
  • Updated On - February 3, 2022 / 11:36 AM IST

‘పుష్ప’ ది రైజ్ పార్ట్ 1 తో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు బన్నీ. ఈ సినిమాతో అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ని చేసేశాడు డైరెక్టర్ సుకుమార్. ఇక పుష్పరాజ్ గా బన్నీ తన నట విశ్వరూపాన్నే చూపించాడని చెప్పాలి. ‘పుష్ప’ మేనియా సోషల్ మీడియాలో ఎలా కొనసాగిందో మనం చూశాం. క్రికెటర్లు సైతం పుష్పరాజ్ గా వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తమ సత్తాని చాటుకునే ప్రయత్నం చేశారు. నిజం చెప్పాలంటే ఇంతటి సక్సెస్ ని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. బాలీవుడ్ లోనూ అక్కడి హీరోలను మించి బన్నీ సినిమా కలెక్షన్లు సాధించింది అంటే మామూలు విషయం కాదు. ‘పుష్ప’ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అంతా కూడా సీక్వెల్ గా తీస్తున్న ‘పుష్ప: ది రూల్’ పైన పెట్టారట. అంతేకాదు, ఇప్పటి నుంచే ఓ విడుదల తేదీని టార్గెట్ గా పెట్టుకుని, ఆ సమయానికే సినిమాని పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అనే క్రేజ్ తెచ్చి పెట్టిన లెక్కల మాష్టారు సుకుమార్, ఈ సీక్వెల్ ని పార్ట్-1 కంటే గ్రాండ్‌గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తనకు సన్నిహితులైన రచయితల బృందానికి ‘పుష్ప: ది రూల్’ కథను వివరించి, వారిచ్చిన సలహాలను తీసుకున్నట్లు సమాచారం. పార్ట్ 1 లో అక్కడక్కడ చోటుచేసుకున్న కొన్ని లోపాలను పార్ట్-2 లో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప రాజ్‌గా ఐకాన్ స్టార్ పర్ఫార్మెన్స్ పార్ట్-1 లోనే పీక్స్ అంటే… ఇప్పుడు తెరకెక్కనున్న పార్ట్ 2లో అంతకు మించి ఉండేలా సుక్కు ఓ సరికొత్త మేనరిజాన్ని బన్నీకి పెడుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప: ది రూల్’ లో కూడా హీరోయిన్‌ గా రష్మిక మందన్న నటిస్తోంది. ఇటీవల ఫారిన్ ట్రిప్ ముగించుకొని వచ్చిన బన్నీ, పుష్ప పార్ట్ -2 కోసం సిద్దమవుతున్నారు. ఫిబ్రవరి లోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు మేకర్స్.

‘పుష్ప: ది రైజ్’ ఇచ్చిన ఘన విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న పుష్ప టీమ్… ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పార్ట్-2 మీదనే పెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌ తో ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ‘పుష్ప: ది రైజ్’ ను ఆకాశంలో ఉంచిందనే చెప్పాలి. పాటలన్నీ కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. దీంతో ఈసారి సీక్వెల్ కోసం మరో లెవల్‌లో సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నారట దేవీశ్రీ. అయితే, మేకర్స్ తాజాగా పుష్ప సినిమా సీక్వెల్‌ను కూడా డిసెంబర్ 17 నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. పుష్ప పార్ట్-1 కూడా ఇదే తేదీన వచ్చి ఎవరూ ఊహించని విజయం నమోదు చేయడంతో… ఆ డేట్ బాగా కలిసి వస్తుందన్న సెంటిమెంట్ తో… అదే తారీఖున సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేయాలని గట్టిగా మేకర్స్ డిసైడయ్యారని తెలుస్తోంది. కాకపోతే… ‘పుష్ప పార్ట్-2’ ని ఇంకా ముందే విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ, మూవీ మేకర్స్ మాత్రం సెంటిమెంట్ కే జై కొట్టారట. అందుకే ‘పుష్ప: ది రూల్’ కూడా ఈ ఏడాది డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా విడుదల కానుందట. ‘పుష్ప: పార్ట్-1’ తోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన బన్నీ…. ‘పుష్ప: ది రూల్’ గా ఇంకెంత షేక్ చేస్తాడో అన్నది చూడాలి.