AkshayKumar: ట్రోలింగ్ బారిన అక్షయ్ కుమార్.. పొగాకు యాడ్ కు గుడ్ బై!

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.

  • Written By:
  • Updated On - April 21, 2022 / 11:23 AM IST

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అలాగని ఆయన ఏది పడితే అది చెబుతాను.. ఎందులో పడితే అందులో నటించేస్తాను అంటే ఫ్యాన్సేకాదు.. ప్రజలూ ఒప్పుకోరు. అందుకే ఆయన ఓ పాన్ మసాలా బ్రాండ్ యాడ్ లో నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దెబ్బకు అక్షయ్ కుమార్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. పైగా భవిష్యత్తులో ఎలాంటి పొగాకు ఉత్పత్తుల యాడ్స్ లోనూ నటించని చెప్పక తప్పలేదు.

హీరోలపై మామూలుగా అయితే ట్రోలింగ్ కామన్. కానీ అక్షయ్ కుమార్ ఇలాంటి పాన్ మసాలా బ్రాండ్లతో అసోసియేషన్ అవ్వడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే సినిమా హీరోలంటే పడిచచ్చేవారు చాలామంది ఉంటారు. వాళ్లు ఏం చెబితే అది వింటారు. అలాంటిది.. పాన్ మసాలా తినమని హీరోలు చెబితే ఊరుకుంటారా. దానిని తినడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదే నెటిజన్లతోపాటు ఫ్యాన్స్ కు, ప్రజలకూ ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అక్షయ్ కుమార్ వెనకడుగు వేయాల్సి వచ్చింది.

ఈ పాన్ మసాలా బ్రాండ్ తో ఇప్పటికే షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లు ఒప్పందం చేసుకున్నారు. ఆ యాడ్స్ లో నటిస్తు్న్నారు. వాళ్లు ఎలాగూ నటిస్తున్నారు కదా అని అక్షయ్ కూడా రంగంలోకి దిగినట్లుంది. కానీ ఆయన నిర్ణయం ఫ్యాన్స్ కు నచ్చలేదు. అందుకే ఇలాంటి యాడ్స్ చేయనంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ముందే కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం.. ఈ యాడ్ నిర్ణీత కాలం వరకు ప్రసారమవుతుందని తరువాత ఆగిపోతుందని చెప్పాడు. పైగా ఈ యాడ్ కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ ను ఒక మంచి పనికి ఉపయోగిస్తానని ప్రకటించాడు. దీంతో అక్షయ్ మంచి నిర్ణయం తీసుకున్నాడంటున్నారు నెటిజన్లు.