Site icon HashtagU Telugu

Betting Apps : బెట్టింగ్‌ యాప్స్ వ్యవహారం.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌లపై ఫిర్యాదు

Betting Apps Promotion Case Balakrishna Prabhas Gopichand

Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం‌లో స్టార్ హీరోలు ప్రభాస్, నందమూరి బాలకృష్ట, గోపిచంద్‌‌లపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ సీజన్-2 షో జరిగింది.  ఈ షోలో హీరోలు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణ సంయుక్తంగా ‘Fun88’ అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ ఫిర్యాదుదారుడు ఆరోపించారు.  ఇమ్మనేని రామారావు అనే వ్యక్తి ఈమేరకు మారేడుపల్లి పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆయన కోరారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read :Bhagat Singh : చరిత్రలో ఈరోజు.. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వీర మరణం.. కీలక ఘట్టాలివీ

ఫిర్యాదులో ఉన్న వివరాలివీ.. 

‘‘ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయిన  అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్, గోపీచంద్‌లు గెస్టులుగా హాజరయ్యారు.  ఈ షో వేదికగా ఫన్ 88 బెట్టింగ్ యాప్‌ను బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్‌లు ప్రమోట్ చేశారు. ఈ ఎపిసోడ్ చూసి నేను బెట్టింగ్ యాప్‌ను(Betting Apps) డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఫన్ 88 యాప్‌లో బెట్టింగ్ ఆడి రూ.83 లక్షలు పోగొట్టుకున్నాను. మొదటిసారి రూ. 10వేలు పెట్టగా 18వేలు వచ్చాయి. అలా వస్తూ, పోతూ రూ. 3లక్షల దాకా సంపాదించాను. అప్పులు కట్టేశాను. డబ్బులు వచ్చాయి కదా అని మళ్లీ ఆడాను. ఆ తర్వాత డబ్బులు పోవడం మొదలైంది. ఊరిలో తెలిసిన వాళ్ల దగ్గర, బంధువులు, స్నేహితుల దగ్గర అప్పులు చేశాను. మొత్తం 83 లక్షలు పోగొట్టుకున్నాను. అప్పుల బాధ భరించలేక ఊరు వదిలి పారిపోయి వచ్చాను’’ అని ఫిర్యాదులో ఇమ్మనేని రామారావు పేర్కొన్నారు.

Also Read :Araku Coffee : పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్.. ఎందుకు ? ప్రత్యేకత ఏమిటి ?

ఇప్పటివరకు కేసులు నమోదైంది వీరిపైనే.. 

తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో ఇప్పటికే సినీ, టీవీ, సోషల్ మీడియా విభాగాలకు చెందిన పలువురిపై  తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రమోషన్ల కోసం ఆయా వ్యక్తులు చేసుకున్న ఒప్పందాలు, పొందిన నిధులపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో యాంకర్ శ్యామల, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసి యువ‌త‌ను చెడగొడుతున్నారని ఆరోపిస్తూ మియా‌పూర్‌కు చెందిన ప్రమోద్ శర్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్ర‌మోట్ చేసిన రానా ద‌గ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ, ప్ర‌కాశ్‌రాజ్, ప్ర‌ణీత‌, శ్రీముఖి, రీతూ చౌద‌రి, యాంక‌ర్ శ్యామ‌ల‌, అనన్య నాగళ్ల త‌దిత‌రులపై కేసు న‌మోదు చేశారు.