Amit Shah Meets Prabhas: బీజేపీ ఆకర్ష్.. బాహుబలితో అమిత్ షా భేటీ!

తెలంగాణ విమోచన దినోత్సవం జరిగే వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ హైదరాబాద్ వస్తున్నారు.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 11:50 PM IST

తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మోదీ, షా, నడ్డా లాంటి కీలక నేతలు తెలంగాణ పర్యటిస్తూ బీజేపీ ఆకర్ష్ కు తెరలేపారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఎన్టీఆర్, నితిన్ ను కలిసిన బీజేపీ నాయకత్వం తాజాగా మరోసారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భేటీ కానుంది. ప్రస్తుతం ఈ వార్త అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. ప్రభాస్ తో జరిగే భేటీలో అమిత్ షా ఏయేం అంశాలు మాట్లాడుకుంటారు? అనేది ఆసక్తిగా మారనుంది. అయితే ప్రభాస్ రాముడి జీవితంపై ‘ఆదిపురుష్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను బీజేపీ క్యాష్ చేసుకుంటుందనే ఆరోపణలున్నాయి.

శనివారం (సెప్టెంబర్ 17) తెలంగాణ విమోచన దినోత్సవం ఏడాది పాటు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ హైదరాబాద్ వస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా  కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. తర్వాత పాన్-ఇండియా నటుడు ప్రభాస్‌తో ప్రత్యేక సమావేశంలో సంభాషించనున్నారు.

తాజాగా టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అమిత్ షాను కలిశారు. నటుడు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు అప్పట్లో జోరందుకున్నాయి. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. జాతీయ జెండాను ఎగురవేసి కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.