Aha : ‘ఆహా’.. ఓటీటీ వినోద ప్రపంచంలో చాలా తక్కువ టైంలో మంచిపేరును సంపాదించింది. దీన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ 2020లో స్థాపన చేశారు. ఆహాలో అల్లు అరవింద్తో పాటు మై హోమ్ గ్రూప్నకు చెందిన జూపల్లి రాము రావు కూడా స్థాపకులుగా ఉన్నారు. ఆహా వ్యూయర్షిప్ పరంగా విజయం సాధించింది. అయితే అనేక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్, జీ5 వంటి పెద్ద ప్లాట్ఫారమ్ల నుంచి ఆహా తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఇతర OTT ప్లాట్ఫారమ్ల కంటే Aha సబ్స్క్రిప్షన్ ధర తక్కువే. దీంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆహా ఓటీటీని విక్రయించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటా విక్రయించాలా లేక మొత్తం విక్రయించాలా అనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. ఆహాలో వాటా కొనుగోలు చేయడానికి సోనీ, సన్ నెట్ వర్క్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆహాలో వాటాల కొనుగోలు రేసులో సోనీ ముందంజలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆహా (Aha) ఓటీటీ మార్కెట్ విలువ దాదాపు రూ.1500 నుంచి రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
2020లో ప్రారంభమైన ఆహా.. దక్షిణాది భాషలకు చెందిన ప్రముఖ ఓటీటీల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్కు 70 లక్షలకు పైగా మంత్లీ యాక్టివ్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ కంటెంట్ను అందిస్తున్న ఈ ఓటీటీ.. కన్నడ, మలయాళంలోకీ విస్తరించడంతోపాటు ఒక్కో వినియోగదారు నుంచి లభించే సగటు ఆదాయాన్ని సైతం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆహా ఓటీటీ యాజమాన్య సంస్థ అర్హ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.122.08 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఆహా ఓటీటీలో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లు, ప్రత్యేక కంటెంట్ను ప్రసారం చేస్తున్నారు.2022లో ఆహా తమిళ్ను ప్రారంభించడంతో ప్లాట్ఫారమ్ తన పరిధిని విస్తరించింది. తెలుగు ఓటీటీ టాక్ షోలలో విపరీతమైన ఆదరణ పొందిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ఆహాలోనే ప్రసారమైంది.