అంతర్జాతీయ అగ్రగామి 100 బ్యాంకుల్లో భారత్ నుంచి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ లిస్టులోకి చేరతాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రూపాయి బలపడేందుకు తీసుకుంటున్న చర్యలు, మూలు ఖాతాల గుర్తింపు వంటి అంశాలపై మాట్లాడారు.
వరల్డ్ టాప్-100 బ్యాంకుల్లో భారత్ నుంచి అతి త్వరలోనే మరిన్ని బ్యాంకులు చేరతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక విస్తరణ వేగవంతం, బ్యాంకింగ్ వ్యవస్థలో వృద్ధి అందుకు దోహదపడతాయన్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వీకేఆర్వీ రావు స్మారకోపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. అంతర్జాతీయ జాబితాలో చేరగలిగే, దేశీయ పెద్ద బ్యాంకుల సంఖ్యను రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించలేదని తెలిపారు.
‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్యాంకుల వృద్ధి వేగాన్ని గమనించినట్లయితే అంతర్జాతీయ అగ్రగామి 100 బ్యాంకుల్లో అతి త్వరలోనే పలు బ్యాంకులు చేరేందుకు అవకాశం ఉంది.’ అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ టాప్-100 బ్యాంకుల్లో భారత్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43వ స్థానంలో కొనసాగుతోంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 73వ స్థానంలో ఉంది. 2024-25లో దేశంలోని 12 ప్రభుత్వ బ్యాంకులు రికార్డ్ స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాలు అందుకున్నాయి. 2023-24 లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే 26 శాతం మేర పెరగింది. ఈ లెక్కన చూసుకుంటే చాలా బ్యాంకులు ప్రపంచ స్థాయి టాప్ 100 లోకి వెళ్లేందుకు తక్కువ సమయమే పడుతుంది.
మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయిని ఏ స్థాయిలో ఉంచాలనే లక్ష్యాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించలేదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. అమెరికా సుంకాల కారణంగా తలెత్తిన అనిశ్చితులతోనే రూపాయి విలువ క్షీణించినట్లు చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. దీంతో దేశ కరెంట్ ఖాతాపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. కరెంట్ ఖాతాతో పాటుగా క్యాపిటల్ ఖాతాపై ఎగుమతులు, ఎఫ్ఐఐల ప్రభావం పడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సరిపడా విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని తెలిపారు. దీంతో అంతర్జాతీయ పరిణామాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అలాగే డిజిటల్ మోసాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన మ్యూల్ హంటర్ టూల్ అద్భుతమైన ఫలితాలను అందిస్తోన్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ప్రతి నెలా ఈ ఏఐ టూల్ ద్వారా 20 వేలకు పైగా మ్యూల్ ఖాతాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఈ మ్యూల్ హంటర్ ఏఐ టూల్ని 20 బ్యాంకుల్లో వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిని దాదాపు దగ్గరగా ఉన్నామని వివరించారు.
