Site icon HashtagU Telugu

SEBI Chief : రంగంలోకి కేంద్రం.. సెబీ చీఫ్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు

Parliamentary Panel Summons To Sebi Chief Madhabi Buch

SEBI Chief : అదానీ గ్రూపునకు చెందిన పలు విదేశీ కంపెనీలలో వాటాలను కలిగి ఉన్నారనే అభియోగాలను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ చీఫ్‌ మాధవీ పురీ బచ్‌ ఎదుర్కొంటున్నారు. సెబీ చీఫ్ హోదాలో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి ఆమె శాలరీ కూడా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.  ఈనేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వరుస ఆరోపణల తర్వాత.. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో పార్లమెంటుకు చెందిన పబ్లిక్  అకౌంట్స్ కమిటీ (పీఏసీ) నుంచి సెబీ చీఫ్‌కు సమన్లు జారీ అయ్యాయి. అక్టోబర్‌ 24న తమ ఎదుట హాజరుకావాలని పీఏసీ ఆదేశించింది. కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ట్రాయ్‌ అధికారులకు కూడా పీఏసీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. వారంతా పీఏసీ ఎదుట హాజరై.. అభియోగాలపై వివరణ(SEBI Chief) ఇచ్చుకోనున్నారు. అయితే ఈ నెల 24న జరగనున్న విచారణకు సెబీ చీఫ్ మాధవి, ట్రాయ్ ఛైర్‌పర్సన్‌ అనిల్ కుమార్‌ నేరుగా హాజరుకారనే టాక్ వినిపిస్తోంది. వారి తరఫున న్యాయవాదులు వస్తారని అంటున్నారు.

Also Read :Anti Naxal Operation : 31 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో మాట్లాడిన అమిత్‌షా

సెబీ చీఫ్ మాధవిపై ఏకంగా సెబీ అధికారులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఆమె నియామకం జరిగినప్పటి నుంచి సెబీ ఆఫీసులో పని సంస్కృతి దెబ్బతిందని అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవలే సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ నుంచి 2019-2021 మధ్యకాలంలో మాధవి భర్త ధవల్ బుచ్ రూ.4.78 కోట్లు అందుకున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. డాక్టర్ రెడ్డీస్, పిడీలైట్, ఐసీఐసీఐ, సెంబ్‌కార్ప్, విసు లీజింగ్ అండ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ సంస్థలకు కూడా సెబీ చీఫ్ మాధవికి చెందిన కన్సల్టెన్సీ కంపెనీ ‘అఘోరా’ సేవలు అందించి ఆర్థిక ప్రయోజనాలు పొందిందని ఖేరా అప్పట్లో పేర్కొన్నారు.