Site icon HashtagU Telugu

Jio Prepaid Plan: రిలయన్స్ జియో వినియోగదారులకు షాక్!

Jio Prepaid Plan

Jio Prepaid Plan

Jio Prepaid Plan: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ (Jio Prepaid Plan) కస్టమర్లకు షాక్ ఇస్తూ రూ.249 ప్లాన్‌ను నిలిపివేసింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ టెలికాం సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం తక్కువ డేటా వాడే వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రోజుకు 1జీబీ డేటా కోసం ఈ ప్లాన్‌పై ఆధారపడిన వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. జియో అధికారిక వెబ్‌సైట్, మై జియో యాప్ నుంచి రూ.249 ప్లాన్‌ను తొలగించారు. ఇటీవల కాలంలో జియో తన పాపులర్ ప్లాన్‌లను తొలగించడం లేదా వాటి ప్రయోజనాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు షాక్ ఇస్తోంది.

అప్పటికీ రీఛార్జ్ చేయవచ్చు

టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. రూ.249 ప్లాన్ అధికారిక సైట్, యాప్‌ నుంచి తొలగించినప్పటికీ జియో స్టోర్స్, పీఓఎస్ రిటైలర్ల ద్వారా ఈ ప్లాన్‌ను ఇంకా రీఛార్జ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: Russia Offer: భార‌త్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ర‌ష్యా.. చమురు కొనుగోళ్లపై 5 శాతం రాయితీ!

రిలయన్స్ జియో రూ.249 ప్లాన్ వివరాలు

గతంలో రూ.249 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించేవి. ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించేదిగా ఉండేది. తాజాగా జియో సంస్థ మ‌రో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొల‌గించింది. రూ. 799తో 84 రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు అందించే ప్లాన్‌ను ర‌ద్దు చేసింది.ఇక‌పై యూజ‌ర్లు ఈ సేవ‌లు కావాల‌నుకుంటే రూ. 889తో రీఛార్జ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఏమిటి?

ప్రస్తుతం రిలయన్స్ జియో వద్ద 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా అందించే ప్లాన్ అందుబాటులో లేదు. దీనికి బదులుగా వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ మొత్తం 2జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ డేటా, వ్యాలిడిటీ అవసరమైతే, మీరు ఇప్పుడు రూ.249 బదులుగా రూ.299 ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఈ ప్లాన్ రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతున్న జియో

ట్రాయ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో జియో నెట్‌వర్క్‌కు 19 లక్షల మంది కొత్త వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు చేరారు. అదే సమయంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 7,63,482 మంది చేరారు. ఈ కాలంలో వీఐ 2,17,816 మంది వినియోగదారులను కోల్పోగా, బీఎస్‌ఎన్‌ఎల్ 3,05,766 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ప్రతి నెలా జియో నెట్‌వర్క్‌లో వేలాది, లక్షల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు.