Site icon HashtagU Telugu

Indias GDP: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్!

Indias GDP

Indias GDP

Indias GDP: భారత ఆర్థిక వ్యవస్థ (Indias GDP) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2025-26) 7.8% అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 6.5% వృద్ధి కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా నిపుణులు అంచనా వేసిన 6.7% రేటును కూడా ఇది అధిగమించింది. ఈ వృద్ధితో చైనా 5.2% వృద్ధి రేటుతో పోలిస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ గణనీయమైన వృద్ధి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

గత 5 త్రైమాసికాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి

2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు నమోదైన 7.8% వృద్ధి గత ఐదు త్రైమాసికాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం. ఈ వృద్ధి రేటు దేశ ఆర్థిక బలాన్ని, స్థితిస్థాపకతను ప్రదర్శిస్తోంది.

ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న భారతదేశ ప్రాబల్యం

ఈ కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.2% రేటుతో వృద్ధి చెందింది. దీనితో పోలిస్తే భారతదేశం సాధించిన 7.8% వృద్ధి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దాని స్థానాన్ని సుస్థిరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వంటి దేశాలు విధించిన దిగుమతి సుంకాల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ విజయం మరింత కీలకంగా మారింది.

Also Read: Healthy Breakfast: షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఫుడ్ ఇదే!

వృధ్ధికి ప్రధాన కారణాలు

ఈ అద్భుతమైన పనితీరుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలైన రోడ్లు, ఓడరేవులు, రహదారులపై పెట్టిన పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండ్, బలమైన వ్యవసాయ ఉత్పత్తి ఈ వృద్ధికి ఊతమిచ్చాయి. అంతేకాకుండా ప్రజల వినియోగం (ప్రైవేట్ కన్సంప్షన్) కూడా పెరగడం ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులలో కొంత బలహీనత ఉన్నప్పటికీ మొత్తంమీద ఆర్థిక వ్యవస్థ ఈ సవాళ్లను అధిగమించి బలమైన పనితీరును ప్రదర్శించింది.

నిపుణుల అభిప్రాయం

నిపుణుల అంచనా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3% నుండి 6.8% మధ్య వృద్ధి చెందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రభుత్వ విధానాలైన పన్నుల రాయితీలు, పెట్టుబడులకు ప్రోత్సాహం వంటివి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయగలవు. ఈ వృద్ధి భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత శక్తిమంతంగా మారుస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకారం.. భారతదేశం 2025 చివరి నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక విధానాలు, బలమైన దేశీయ డిమాండ్, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువ శ్రామికశక్తికి లభించిన ఫలితం.