Indias Largest IPO : దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దాదాపు రూ.25,000 కోట్ల నిధుల సమీకరణ కోసం దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు రానుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను హ్యుందాయ్ కంపెనీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇక సెబీ ఆమోదం లభించడమే తరువాయి. సెబీ పచ్చజెండా ఊపితే.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు వచ్చిన కంపెనీగా హ్యుందాయ్ (Indias Largest IPO) సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది.
- హ్యుందాయ్ కంపెనీ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన జరుగుతుంది.
- ఈ ఐపీఓలో భాగంగా 14.21 కోట్ల ఈక్విటీ షేర్లను హ్యుందాయ్ కంపెనీ విక్రయిస్తుంది. కొత్తగా షేర్ల జారీ అనేది జరగదు.
- ఈ కంపెనీ 1996 సంవత్సరంలో మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది.
- హ్యుందాయ్ కంపెనీ 1998లో మనదేశంలో తొలి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. 2008 సంవత్సరంలో రెండో కర్మాగారాన్ని స్థాపించింది.
- ఈ కంపెనీ మనదేశంలో 13 మోడళ్ల కార్లను అమ్ముతోంది.
- i20, వెర్నా, క్రెటా, ఆరా, టక్సన్ మోడళ్ల కార్లన్నీ ఈ కంపెనీవే.
- 2023 సంవత్సరంలో మొత్తంగా ఆరు లక్షల కార్లను అమ్మింది.
- ఈ ఏడాది మేలో హ్యుందాయ్ కంపెనీ 63,551 కార్లను మనదేశంలో అమ్మింది.
- హ్యూందాయ్ కంపెనీ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 60,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రూ. 4,653 కోట్ల లాభాలను గడించింది.
- దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత మన దేశంలోని స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ కావడానికి వస్తున్న ఆటోమొబైల్ కంపెనీ ఇదే.
- చివరిసారిగా 2003 సంవత్సరంలో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ మన దేశ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది.