Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అందుతోంది. ఇటీవల కేంద్రం దిగుమతి సుంకాల్ని పెంచిన సమయంలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరగ్గా.. అక్కడి నుంచి చూస్తే భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. బంగారం ధర ఈ క్రమంలో 3 రోజుల్లో రూ. 10 వేలకు పైగా తగ్గగా.. సిల్వర్ రేటు రూ. 30 వేలు దిగిరావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారతీయులను బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు […]

Published By: HashtagU Telugu Desk
Gold Rate Today

Gold Rate Today

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అందుతోంది. ఇటీవల కేంద్రం దిగుమతి సుంకాల్ని పెంచిన సమయంలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరగ్గా.. అక్కడి నుంచి చూస్తే భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. బంగారం ధర ఈ క్రమంలో 3 రోజుల్లో రూ. 10 వేలకు పైగా తగ్గగా.. సిల్వర్ రేటు రూ. 30 వేలు దిగిరావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు తగ్గుతూనే ఉన్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారతీయులను బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపివేయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకునేందుకు పెళ్లిళ్లు, పండగల సమయంలోనూ కొనబోమని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంతా ఆశించారు. ఇందుకు తగ్గట్లుగానే విధానపరమైన చర్యలకు కూడా కేంద్రం ఉపక్రమించింది. తొలుత బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను ఒక్కసారిగా భారీగా పెంచింది. తర్వాత దిగుమతులపైనా కొన్ని పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం, వెండి రేట్లు తొలుత మే 13న మాత్రం కేంద్రం నిర్ణయంతో భారీగా పెరగ్గా, అక్కడి నుంచి వరుసగా తగ్గుతూనే వస్తున్నాయి. ఇవాళ కూడా ధరలు భారీగా తగ్గాయి.

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముడి చమురు ధర మళ్లీ పెరిగి బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద ఉంది. ఈ క్రమంలోనే డాలర్ పెరగడం, బాండ్లపై ప్రతిఫలాలు పెరుగుతుండటంతో బంగారంపై ఒత్తిడి పడుతోంది. బంగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో రేట్లు దిగొస్తూనే ఉన్నాయి. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో మే 16న బంగారం ధర భారీగా తగ్గింది. కిందటి రోజు ఇదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1,46,750 వద్ద ఉండగా.. ఇప్పుడు చూస్తే ఉదయం 10 గంటల సమయంలో గోల్డ్ రేటు రూ. 1,43,850 కి చేరింది. అంటే ఒక్కరోజులోనే రూ. 2900 తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు.

ఆభరణాల బంగారం ధరతో పాటుగానే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా మళ్లీ తగ్గింది. ఇది మే 15న 22 క్యారెట్లకు చూస్తే ధర తులం రూ. 1,60,090 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ. 3160 తగ్గడంతో ధర రూ. 1,56,930 కి చేరింది. గరిష్ఠాల నుంచి చూస్తే ఇంకా భారీగానే తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు.

ఇక బంగారం ధర 3 రోజుల వ్యవధిలోనే రూ. 10 వేలకు పైగానే తగ్గింది. మే 13న కేంద్రం దిగుమతి సుంకాలు పెంచినప్పుడు ఉదయం 10 గంటల సమయంలో భారీగా పెరిగిన గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ. 1,53,900కు చేరగా, ఇప్పుడు రూ. 1,43,850 వద్ద ఉంది. ఈ క్రమంలోనే పసిడి ధర 3 రోజుల్లో రూ. 10,050 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,67,890గా ఉండగా, 3 రోజుల్లో రూ. 10,960 తగ్గి రూ. 1,56,930కి చేరింది.

బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ.15 వేలు తగ్గగా.. ప్రస్తుతం కేజీ వెండి రూ.2.90 లక్షలకు చేరింది. అంతకుముందు కూడా వరుసగా 2 రోజుల్లో రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున తగ్గింది. ఇలా 3 రోజుల్లో రూ.30 వేలు దిగొచ్చింది. దానికి ముందు కేంద్రం సుంకాలు పెంచగా మే 13న రూ.20 వేలు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. 2 రోజుల కిందట స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,700 డాలర్ల మార్కు పైన ఉండగా.. ఇది ఏకంగా 150 డాలర్లకు పైగా తగ్గి 4540 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ రేటు 87 డాలర్ల స్థాయి నుంచి ప్రస్తుతం 75 డాలర్లకు దిగొచ్చింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 95.83 వద్ద ఉంది. కిందటి రోజు రూ. 96 మార్కు దాటి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి కూడా పడిపోయింది.

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు పసిడి కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేయాలని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, అందుకు తగ్గట్లుగా కేంద్రం విధానపర నిర్ణయాలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే దిగుమతి సుంకాల్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దిగుమతుల్ని అడ్డుకోవడంతో పాటు కొనుగోళ్లు తగ్గించాలన్నదే కేంద్రం లక్ష్యం.

భారతదేశం బంగారం వినియోగం విషయంలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే పసిడి దిగుమతుల విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 24 శాతం వరకు పెరిగాయి. ఇలా దిగుమతులు పెరుగుతుండటంతో దీనికి చెల్లింపులు డాలర్లలో చెల్లించాల్సి వస్తుండటంతో విదేశీ మారకం తరలిపోతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం తాజా చర్యలు తీసుకుంటోంది.

భారతదేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. ఇంకా బంగారం అలంకరణ సామగ్రిగానే కాకుండా పెట్టుబడి సాధనంగానూ మంచి గిరాకీ సంపాదించుకుంది. బంగారంతో పాటు వెండిపైనా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది చూస్తే బంగారం ధర ఏకంగా 70 శాతం పెరగ్గా, వెండి ధర 150 శాతం వరకు పెరగడం విశేషం.

 

  Last Updated: 16 May 2026, 11:23 AM IST