Paytm – Adani : అదానీ గ్రూపు శరవేగంగా విస్తరిస్తోంది. గౌతమ్ అదానీ అన్ని రకాల వ్యాపార రంగాల్లోకి అడుగు మోపేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే ఆయన పేటీఎంలోనూ వాటా కొంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చించేందుకు ఆయన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మతో మంగళవారం భేటీ అయ్యారని సమాచారం. అయితే ఆ సమావేశంలో ఏం నిర్ణయించారు ? వాటా విక్రయానికి విజయ్ శేఖర్ రెడీ అయ్యారా ? కాలేదా ? అనేది ఇంకా తెలియరాలేదు.
We’re now on WhatsApp. Click to Join
పేటీఎం పేరెంట్ ఆర్గనైజేషన్ పేరు ‘వన్ 97 కమ్యూనికేషన్’. ఇందులో విజయ్ శేఖర్ శర్మకు 19 శాతం వాటా ఉంది. రెసీలియంట్ అసెట్ మేనేజ్మెంట్ అనే విదేశీ సంస్థ ద్వారా విజయ్కు కంపెనీలో మరో 10 శాతం వాటా ఉంది. పేటీఎం కంపెనీ ఇతర షేర్ హోల్డర్ల జాబితాలో సైఫ్ పార్ట్నర్స్ (15 శాతం వాటా), ఆంట్ఫిన్ నెదర్లాండ్స్ (10 శాతం), కంపెనీ డైరెక్టర్లకు 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం పేటీఎం మార్కెట్ విలువ రూ.21,773 కోట్లు ఉందని అంటున్నారు. ప్రస్తుతం పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ తరుణంలో అదానీ ఎంట్రీ ఇచ్చి వాటాలు కొనేశాక.. పరిస్థితులు మారుతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పేటీఎంకు(Paytm – Adani) మంచి ఫ్యూచర్ ఉంటుందని, తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ సర్వీసుల సంస్థలకు పోటీని ఇచ్చేలా పేటీఎంను అదానీ డెవలప్ చేస్తారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి త్రైమాసికం (2024 జనవరి – మార్చి)లో పేటీఎంలో భారీగా నష్టాలు వచ్చాయి. కంపెనీకి దాదాపు రూ.551 కోట్ల నష్టం వచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.221.7 కోట్ల నష్టం వచ్చింది. అంటే నష్టం దాదాపు డబుల్ అయింది. నష్టం కారణంగా పేటీఎం ఆదాయం కూడా 20 శాతం తగ్గిపోయి రూ.2,267 కోట్లకు చేరింది. జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షల కారణంగా పేటీఎం వాలెట్, బ్యాంకింగ్ సేవలు డౌన్ అయ్యాయి.