Dragon Bike : కొంతమందికి ఎంత చదివినా క్రియేటివిటీ రాదు. కొత్తగా ఏదీ క్రియేట్ చేయలేరు. ఇంకొంతమంది మాత్రం ఆసక్తే పెట్టుబడిగా క్రియేటివిటీని ప్రదర్శిస్తారు. ఆ కోవలోకే వస్తాడు ఉత్తరప్రదేశ్లోని కుశినగర్కు చెందిన యువకుడు గబ్బర్ భారతి. అతడు బడాబడా మెకానికల్ ఇంజినీర్లతోనూ వావ్ అనిపించే ఒక ఆవిష్కరణ చేశాడు. సాధారణ బైక్ మెకానిజం నేర్చుకున్న గబ్బర్ భారతి.. రూ.5 వేల విలువైన పాత బైక్ను కొని రాత్రి పగలూ కష్టపడి అదుర్స్ అనిపించే డ్రాగన్ బైక్ను రెడీ చేశాడు. దాన్ని చూసిన వారంతా వావ్ అంటున్నారు. ఇప్పుడు జాతీయ మీడియాలోనూ గబ్బర్పై న్యూస్ స్టోరీస్ పబ్లిష్ అవుతున్నాయి. ఇంజినీరింగ్ డిగ్రీ కానీ.. డిప్లొమా కానీ లేకున్నా.. 2వ తరగతి వరకే చదువుకున్నా ఇంత పెద్ద ఆవిష్కరణ చేయడం గ్రేట్ అని అందరూ మెచ్చుకుంటున్నారు. గబ్బర్ బాల్యం మొత్తం పేదరికంలో గడిచింది. అతడు తయారు చేసిన డ్రాగన్ బైక్ను చూస్తే.. ఎవరో శిక్షణ పొందిన ఇంజనీర్ తయారు చేసి ఉంటారని మనం భావిస్తాం. అంతలా అది పర్ఫెక్ట్ షేప్, టెక్నాలజీతో ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన గబ్బర్ తండ్రి చిన్నతనంలోనే తల్లిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటి నిర్వహణ కోసం గబ్బర్ హోటల్లో పనిచేయాల్సి వచ్చింది. ఆ తరువాత అతని మామ తనతో పాటు గబ్బర్ను తీసుకొని బెంగాల్కు వలస వెళ్లాడు. తల్లి, వికలాంగులైన ఇద్దరు సోదరుల భారాన్ని మోస్తూ గబ్బర్ జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. పెళ్లయ్యాక అతడి భుజ స్కంధాలపై బాధ్యతలు మరింత పెరిగాయి. ఈక్రమంలో గబ్బర్ బెంగాల్లో వెల్డింగ్ పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని పోషించడానికి అనేక రాష్ట్రాల్లో వెల్డర్గా పనిచేశాడు.
చిన్నప్పటి నుంచి ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచన గబ్బర్కు ఉండేది. అందుకే కుశినగర్లోని తమ్కుహిరాజ్ పట్టణంలో వెల్డర్గా పని చేయడం ప్రారంభించాడు. ఇక్కడ అతడు నిత్యం ఏదో ఒక కొత్త పని చేయాలనే ఆలోచనలో ఉండేవాడు. ఓ రోజు ఆ ఊరి పొలంలో ప్రత్యేకమైన పురుగును చూసి, అదే మోడల్లో బైక్ను తయారు చేయాలని గబ్బర్ నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత 2023 ఏప్రిల్లో అతడు తన బంధువులలో ఒకరి నుంచి పాత బైక్ (Dragon Bike) ఒకదాన్ని కొన్నాడు. దాన్ని తన ఆలోచన ప్రకారం అప్గ్రేడ్ చేయడం ప్రారంభించాడు. 5 నెలలు కష్టపడి చివరకు దాన్ని డ్రాగన్ బైక్ లుక్లోకి మార్చేశాడు. రానున్న రోజుల్లో మరిన్ని వెరైటీ డిజైన్లతో బైక్లను మోడిఫై చేస్తానని గబ్బర్ అంటున్నాడు. ఇలాంటి వారిని ప్రభుత్వం దత్తత తీసుకొని ప్రోత్సహిస్తే ఆవిష్కరణలకు అంతు ఉండదు.