MLA Pinnelli : ఏపీలోని మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలోని సంగారెడ్డి వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో కారులోనే మొబైల్ను వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారు. వారిని ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న పోలింగ్ వేళ మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(MLA Pinnelli) ఈవీఎంను ధ్వంసం చేయడం కలకలం రేపింది. టీడీపీకి బలమైన పట్టు ఉన్న రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రభుత్వ విప్గా కేబినెట్ హోదా కలిగిన పదవిలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు బయటపడుతుండటంతో అరెస్ట్ తప్పదన్న భయంతో ఇటీవల పరారయ్యారు. పల్నాడులో హింసాకాండపై హైకోర్టు చివాట్లు పెట్టడం, ఎస్పీ సహా ఏడుగురు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం, కలెక్టర్ను బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది.అల్లర్లపై దర్యాప్తునకు సిట్ను నియమించారు. దీంతో పిన్నెల్లి సోదరులు తెలంగాణకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గన్మెన్లను వదిలేసి తెలంగాణకు పారిపోయి రావడం గమనార్హం.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో రెండు బూత్లు ఉన్నాయి. 1,464 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. కానీ పోలింగ్ రోజున అక్కడున్నది కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టినా, టీడీపీ శ్రేణులపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ అరాచకం సృష్టించినా చోద్యం చూడటం తప్ప ఆ కానిస్టేబుళ్లు ఏమీ చేయలేకపోయారు. ఇక ఏపీలోని పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, 34 కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే 19 కంపెనీల్ని మాత్రమే పంపారు.