YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి

YS Sunitha Reddy : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు.

  • Written By:
  • Updated On - March 15, 2024 / 03:44 PM IST

YS Sunitha Reddy : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు. ఈసందర్భంగా వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ వైఎస్ వివేకానందరెడ్డి మాకు దూరమై ఐదేళ్లయింది. ఆయనకు అంత కీడును ఎవరు తలపెట్టారని మేమంతా ఆలోచిస్తుండగానే.. జగనన్న సీఎం అయ్యారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణస్వీకారం చేశారు. అది చూసి మనమంతా గర్వపడ్డాం. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణ శుద్ధిగా ఉండటం అంటే మీకు అర్థం తెలుసా? వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీపైనే  ఉంది’’ అని సునీతా రెడ్డి వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ  హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు? మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు ? ప్రభుత్వంలో ఉండి.. మాపై ఆరోపణలు చేయడమేంటి? హంతకులను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. జగనన్నా.. మమ్మల్ని పట్టించి ఆ బహుమతి అందుకోండి’’ అని సునీతా రెడ్డి(YS Sunitha Reddy) సూచించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్షపడాలని పోరాడుతున్న తనపైనే నింద మోపుతారా అని ఆమె ప్రశ్నించారు. హత్యతో తన కుటుంబానికి సంబంధముంటే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ఆమె సీఎం జగన్‌ను ఈ కార్యక్రమం వేదికగా నిలదీశారు.

Also Read :ED Raids : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

‘‘వివేకానందరెడ్డి జీవితాంతం వైఎస్‌ఆర్‌ కోసమే పనిచేశారు. ఉమ్మడి కుటుంబానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఫ్యాక్షన్‌, హింసను తగ్గించాలని నిత్యం ఆలోచించేవారు. పదేపదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా?’’ అని సునీతారెడ్డి ధ్వజమెత్తారు. ‘‘మాపై నిందలు వేస్తూ సాక్షి పత్రికలో వార్తలు రాస్తున్నారు. సాక్షి ఛైర్‌పర్సన్‌‌కు ఓ విన్నపం.. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. మీ కోసం నిరంతరం పని చేసిన వివేకాను మర్చిపోయారా?’’ అని ఆమె కామెంట్ చేశారు. ‘‘తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు ఉంది.. చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు. ప్రజలారా.. మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? మీకు స్పందించే అవకాశం వచ్చింది.. స్పందించండి’’ అని సునీతారెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : BRS – BSP : బీఎస్పీకి ఆ 2 లోక్‌సభ సీట్లు.. బీఆర్ఎస్​ కీలక నిర్ణయం