Site icon HashtagU Telugu

YS Sharmila: మ‌రోసారి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ష‌ర్మిల‌..!

YS Sharmila

YS Sharmila

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) మ‌రోసారి సంచ‌లన ట్వీట్ చేశారు. ఈ సారి త‌న ట్వీట్‌లో పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేశారు. సోష‌ల్ మీడియాను కొంద‌రు చెడు చేసే అందుకు ఎక్కువ‌గా ఉపయోగిస్తున్నార‌ని ఆమె మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ష‌ర్మిల త‌న ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. స‌మాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా , రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను.

Also Read: KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ .. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం.

అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి పార్టీలు అయినా తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.