Site icon HashtagU Telugu

YS Jagan : ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ ధర్నా..అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతు

YS Jagan dharna in Delhi.. Akhilesh Yadav support

YS Jagan dharna in Delhi.. Akhilesh Yadav support

YS Jagan dharna: వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఏపిలో వైసీపీ కార్యకర్తల పై దాడులను నిరసిస్తూ..ఢిల్లీలోని జంత్‌మంతర్‌లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రెడ్‌బుక్ పట్టుకున్న ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపిలో తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు చేస్తుందంటూ అఖీలేశ్‌కు జగన్‌ వీడియోలు చూపించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు జగన్‌ ధర్నాకు ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో ఈరోజు జగన్ అధికారంలో లేకపోవచ్చు… రేపు రావొచ్చు, కానీ ప్రతిపక్షాలపై దాడులు సరికాదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అసలు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయపెట్టడం ద్వారా ప్రజాస్వామ్యంలో గెలవలేం అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలోకి కొత్తగా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోను ఏపీ వంటి పరిస్థితులే నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్ సంస్కృతికి తాము వ్యతిరేకమని అఖిలేశ్ తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నారన్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం అన్నారు. ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. జగన్ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వహాబ్ మద్దతు తెలిపారు.

కాగా, జగన్‌ ధర్నాకు అఖీలేశ్‌ యాదవ్‌తో పాటు ఎంపీలు రాంగోపాల్ యాదవ్, ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన శివసేన ( ఉద్ధవ్ వర్గం) లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ శేవాలే, రాజ్య సభ సభ్యులు సంజయ్ రౌత్, అలాగే, తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ తంబి దురై వెళ్లి మద్దతు ప్రకటించారు.

Read Also: King Nagarjuna : నాగార్జున గారు ఏంటండీ ఇది..!