TTD Chairman: ఏడుకొండల వాడి ప్రసాదమైన పవిత్ర లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలపై రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. తిరుమల నెయ్యి సరఫరా కోసం ఇటీవల కేటాయించిన టెండర్లపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధారాలతో తిప్పికొట్టారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
హేతుబద్ధం లేని ఆరోపణలు
శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హెరిటేజ్ సంస్థతో సంబంధం ఉన్న ఇందాపూర్ డెయిరీకి టెండర్లు అప్పగించారని, వారికి మేలు చేసేలా రేట్లు పెంచి ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని టీటీడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ సంస్థకు ఎటువంటి యాజమాన్య సంబంధాలు లేవు. హెరిటేజ్ సంస్థ కేవలం ‘చీజ్’ను మాత్రమే ఇందాపూర్ నుంచి కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసే సంస్థల జాబితాలో గతంలో వైసీపీ ప్రభుత్వం నెత్తిన పెట్టుకున్న ‘అమూల్’ కూడా ఉండటం గమనార్హం. అనేక జాతీయ స్థాయి సంస్థలు ఇందాపూర్ నుంచి ఉత్పత్తులు కొంటుండగా కేవలం హెరిటేజ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని టీటీడీ చైర్మన్ వివరించారు.
Also Read: Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!
నెయ్యి నాణ్యత కోసం సరికొత్త సంస్కరణలు
గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. నెయ్యి స్వచ్ఛతను పరీక్షించేందుకు అత్యాధునిక ‘మినిమమ్ రెసిడ్యూ లెవల్’ స్కోర్ బోర్డు విధానాన్ని అమలులోకి తెచ్చారు. నెయ్యి రవాణాలో నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించారు. తక్కువ సమయంలో నెయ్యి తిరుమలకు చేరడం వల్ల తాజాగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. నందిని డెయిరీ తాము అంత మొత్తంలో నెయ్యిని సరఫరా చేయలేమని తెలపడంతో నిబంధనల ప్రకారం ఇతర సంస్థలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఇందాపూర్ డెయిరీకి రెండు, మదర్ డెయిరీకి రెండు, సంగం డెయిరీకి ఒక టెండర్ను అత్యంత పారదర్శకమైన పద్ధతిలో కేటాయించారు.
భక్తుల నమ్మకమే ముఖ్యం
వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ మచ్చను చెరిపివేసి, స్వామివారి ప్రసాదానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కొత్త బోర్డు ప్రయత్నిస్తుంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురి చేస్తున్నారని నాయకత్వం మండిపడుతోంది. తిరుమల లడ్డూ స్వచ్ఛత విషయంలో తమ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
