Site icon HashtagU Telugu

YS Jagan: మ‌రోసారి కూట‌మి ప్ర‌భుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జ‌గ‌న్‌.. ఏమ‌న్నారంటే?

YS Jagan

YS Jagan

YS Jagan: కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ఎక్స్ వేదిక‌గా మ‌రోసారి మండిప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబుకు సూటిగా ప్ర‌శ్న‌లు వ‌దిలారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ ట్వీట్ వ‌దిలారు.

చంద్ర‌బాబు గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్‌ఎంసీ (NMC) గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌(FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? అని ప్ర‌శ్నించారు.

Also Read: PM Modi Countries Visit: ప్రధాని 5 దేశాల పర్యటన ప్రాముఖ్యత ఏమిటి? ఈ టూర్ ఎందుకు ముఖ్యం?

మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాల‌కు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా? అని ఫైర్ అయ్యారు.

డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వరంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? అని మండిప‌డ్డారు.

మీ అవినీతికోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్‌ నంబర్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్‌ స్టేషన్‌లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని, ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాను అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.