Kadapa : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ప్లాన్

కట్టుకున్న భర్తను హతమార్చేందుకు భార్య వేసిన కుట్ర, చివరి నిమిషంలో సినిమా ఫక్కీలో భర్త ప్రాణాలతో బయటపడిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి దంపతుల

Published By: HashtagU Telugu Desk
Kadapa Illicit Relationship

Kadapa Illicit Relationship

కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకున్న ఈ సంచలన ఘటన వివాహేతర సంబంధాలు ఏ స్థాయికి దారితీస్తాయో తెలియజేస్తోంది. కట్టుకున్న భర్తను హతమార్చేందుకు భార్య వేసిన కుట్ర, చివరి నిమిషంలో సినిమా ఫక్కీలో భర్త ప్రాణాలతో బయటపడిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శిల్పారెడ్డికి జమ్మలమడుగుకు చెందిన నాగసుధీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి వ్యవహారం భర్త ఈశ్వర్ రెడ్డికి తెలియడంతో ఆయన ఆమెను పద్ధతి మార్చుకోవాలని మందలించారు. అయితే, భర్తను మార్చుకోవాల్సింది పోయి, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో అతడిని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని శిల్పారెడ్డి నిర్ణయించుకుంది. ఇందుకోసం తన ప్రియుడు నాగసుధీర్‌తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది.

14 తులాల బంగారం.. రూ.10 లక్షల సుపారీ

భర్తను చంపేందుకు శిల్పారెడ్డి ఏకంగా సుపారీ ముఠాను ఆశ్రయించింది. తన ప్రియుడు నాగసుధీర్ ద్వారా వినయ్ అనే రౌడీషీటర్‌ను కలిసి, హిందూపురానికి చెందిన కిరాయి ముఠాతో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సుపారీ నగదు కోసం తన వద్ద ఉన్న 14 తులాల బంగారాన్ని ప్రియుడికి అప్పగించింది. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి నగదుగా మార్చిన నాగసుధీర్, అడ్వాన్స్‌గా రూ.5 లక్షలను కిరాయి ముఠాకు అందజేశాడు. భర్త కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేస్తూ, పక్కా ప్లాన్‌తో హత్యకు ముహూర్తం ఖరారు చేశారు.

సినిమా లెవల్లో ఎటాక్.. తృటిలో తప్పించుకున్న భర్త

బుధవారం రోజున ఈశ్వర్ రెడ్డి తన బైక్ మీద ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వెళ్తుండగా, కిరాయి ముఠా కారుతో అతడిని ఢీకొట్టింది. కిందపడిన ఈశ్వర్ రెడ్డిని కత్తులతో నరికి చంపేందుకు వారు ప్రయత్నించారు. అయితే, ఆయన అప్రమత్తంగా వ్యవహరించి వారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నేరుగా పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ప్రాణాపాయం గురించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఈ కుట్ర వెనుక భార్య శిల్పారెడ్డి, ఆమె ప్రియుడు నాగసుధీర్ ఉన్నట్లు తేలింది. పోలీసులు వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రొద్దుటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

  Last Updated: 24 Apr 2026, 03:55 PM IST