YS Jagan Vs Dastagiri : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో అతడు పులివెందుల నుంచి ఏకంగా సీఎం జగన్పై పోటీ చేయనున్నారు. ఇటీవల జైభీమ్ పార్టీలో చేరిన దస్తగిరికి పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయనకు పులివెందుల అసెంబ్లీ సీటును ఖరారు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
వివేకా హత్య కేసుతో ఫేమస్ అయిన దస్తగిరి.. ఆ తర్వాత తన తప్పును సీబీఐ అధికారుల ముందు ఒప్పుకుని అఫ్రూవర్ గా మారారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వారి అనుచరులే వివేకాను హత్య చేశారని దస్తగిరి సాక్ష్యం చెప్పారు. ఈనేపథ్యంలో నాలుగు నెలల క్రితం దస్తగిరిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి మరోసారి జైలుకు పంపారు. దాదాపు వందరోజుల పాటు కడప జిల్లా జైలులో ఉన్న దస్తగిరి ఇటీవలే విడుదలయ్యారు. జైలు నుంచి బయటికొచ్చిన దస్తగిరికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి వరుస బెదిరింపులు వచ్చాయనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని సీబీఐకి దస్తగిరి (YS Jagan Vs Dastagiri) తెలిపాడు. దీంతో ప్రత్యేకంగా గన్ మెన్లతో అతడికి రక్షణ కల్పించారు.
జైలు నుంచి బయటకు వచ్చాక.. సీఎ జగన్పై దస్తగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు. జైలులో తనతో మరోసారి బేరమాడారని రూ.20 కోట్లు అడ్వాన్స్ ఇవ్వచూపారని ఆరోపించారు. అబద్ధపు సాక్ష్యం చెప్పకుంటే చంపేస్తామని బెదిరించారని చెప్పాడు. తాను చావుకు తెగించానన్న దస్తగిరి.. పులివెందులలో అవినాష్ ఇంటిపక్కనే ఉంటానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్పైనా తీవ్ర విమర్శలు చేశాడు. గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకొని జగన్ ఎన్నికల్లో గెలిచాడని.. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న జగన్ ఇప్పుడు వివేకాను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే పులివెందులలో ఓట్లు అడగాలని నిలదీశారు. రాజకీయం అండ చూసుకుని తన జీవితంతో ఆడుకుంటున్నారని…అందుకే అదే రాజకీయాల్లోకి వస్తానని అప్పుడే దస్తగిరి శపథం చేశారు. అన్నట్లుగానే జైభీమ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి దస్తగిరి ఎంట్రీ ఇచ్చారు. వివేకాను ఎవరు చంపారో చెప్పే ధైర్యం తనకు ఉందని.. ఆ ధైర్యం జగన్ కు ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.